కొణతాల కొత్త ట్విస్ట్.. మళ్ళీ టీడీపీ వైపు అడుగులు

 

ఏపీలో ఎన్నికల తేదీ దగ్గర పడుతుండడంతో కొందరు నేతలు టీవీలో ఛానల్ మార్చినంత ఈజీగా పార్టీలను మార్చేస్తున్నారు. ప్రస్తుతం ఏపీలో.. ఏ నేత, ఏ పార్టీలో ఉన్నారో? ఏ పార్టీలో చేరతారో? తెలియని పరిస్థితి నెలకొంది. మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ కూడా రోజుకో వైపు అడుగు వేస్తూ తెగ కన్ఫ్యూజ్ చేస్తున్నారు. మొన్న హైదరాబాద్‌లోని లోటస్‌పాండ్‌లో వైసీపీ అధినేత జగన్‌ను కలిసిన కొణతాల రెండ్రోజులకే చంద్రబాబుతో భేటీ అయ్యి ట్విస్ట్ ఇచ్చారు. వైసీపీ ప్రకటించిన అభ్యర్థుల జాబితాలో కొణతాలకు చోటుదక్కకపోవడంతో ఆయన మళ్లీ యూటర్న్ తీసుకున్నారు. ఈరోజు ఉదయం చంద్రబాబుతో కొణతాల భేటీ అయ్యి పార్టీలో చేరికపై చర్చించారు.
 
నిజానికి కొణతాల ముందు టీడీపీలో చేరుతున్నట్లు వార్తలొచ్చాయి. జగన్ ను కలవడానికి ముందే.. గతంలో రెండు సార్లు చంద్రబాబును కలవడంతో ఆయన టీడీపీ తీర్థం పుచ్చుకుంటారని అనుకున్నారంతా. కానీ ఏమైందో ఏమో కానీ సడన్ గా ఆయన రెండు రోజుల క్రితం జగన్ ని కలిశారు. దీంతో కొణతాల వైసీపీ గూటికి చేరిపోయారని అందరూ ఫిక్స్ అయ్యారు. కానీ వైసీపీలో సీటు దక్కకపోవడంతో సడన్‌గా మళ్ళీ చంద్రబాబుతో సమావేశం అయ్యారు. మరి వైసీపీ గడప తొక్కొచ్చిన కొణతాలకు టీడీపీలో టికెట్ దక్కుతుందో లేదో చూడాలి.