బీజేపీలో చేరికపై స్పందించిన కోమటిరెడ్డి.. అదే తన లక్ష్యం!!

 

బీజేపీ ప్రధాన కార్యదర్శి రామ్ మాధవ్ ను కాంగ్రెస్ నేతలు రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కలిసారని.. వారితో పాటు కేసీఆర్ అన్న కూతురు రమ్యా రావు, మాజీ ఎంపీ వివేక్ కూడా కలిసారని వార్తలొచ్చిన విషయం తెలిసిందే. త్వరలోనే వీరు బీజేపీలో చేరతారని కూడా ప్రచారం జరిగింది. అయితే ఈ వార్తలను కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఖండించారు. కావాలనే తమపై దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. తాము బీజేపీలో చేరుతున్నామని వస్తున్న వార్తలన్నీ అవాస్తవాలని తేల్చి చెప్పారు. కాంగ్రెస్ ను వీడే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. తాను కాంగ్రెస్‌ పార్టీలోనే ఉంటానని, పార్టీని అధికారంలోకి తీసుకు రావడమే తన లక్ష్యమన్నారు. నిన్న మొత్తం నియోజకవర్గంలోనే పర్యటించినట్లు కోమటిరెడ్డి పేర్కొన్నారు. తాను నల్గొండలో ఉంటే ఎప్పుడు, ఎలా రాంమాధవ్ ను కలిశానో చెప్పాలని ఆయన ప్రశ్నించారు. తప్పుడు వార్తా కథనాలు ప్రసారం చేసిన వారిపై పరువు నష్టం దావా వేస్తానని కోమటిరెడ్డి వార్నింగ్ ఇచ్చారు.