TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

కేబినెట్ నుంచి కొడాలి నాని అవుట్.. అందుకేనా?

Published on: Thu Mar 31, 2022 10:51AM

ముఖ్యమంత్రి వైయస్ జగన్... తన మలి కేబినెట్‌ కూర్పు అంతా ఓకే అయిందని సమాచారం. అయితే ఆ కేబినెట్‌లోని మంత్రుల జాబితాలో నుంచి గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని పేరు తొలగించినట్లు తెలుస్తోంది. కేబినెట్ కూర్పుపై పార్టీలోని పలువురు సీనియర్లతో సీఎం జగన్ పలుమార్లు భేటీ కావడం.. ఆ క్రమంలో కొత్తగా కొలువులు పొందుతున్న వారి వివరాలపై పూర్తిగా తర్జన భర్జనలు చేసిన తర్వాతే సీఎం జగన్ ఓకే చేశారని సమచారం. అయితే చిట్టచివరి నిమిషంలో ప్రస్తుత మంత్రి కొడాలి నాని పేరును ఆ జాబితా నుంచి తొలగించారట. అసలు అయితే.. జగన్ అధికారంలోకి రాగానే.. కొడాలి నానికి పౌరసరఫరాల శాఖ మంత్రిగా బాధ్యతలు అప్పగించారు. అ నాటి నుంచి నేటి వరకు కొడాలి నాని ప్రెస్‌మీట్ పెట్టారంటే..  టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేశ్‌తోపాటు ఆ పార్టీలోని కీలక నేతలపై బండ బూతులతో విరుచుకు పడతారనే టాక్ అయితే ప్రజల్లో సర్వ సాధారణమై పోయింది. ఈ రెండున్నరేళ్లలో కొడాలి నాని ప్రెస్‌మీట్ అంటే.. చంద్రబాబు అండ్ కోకు బ్యాండ్ బాజా అని మీడియా వారికే సైతం పక్కా క్లారిటీగా అర్థమైపోయింది. 

ఈ నేపథ్యంలో సీఎం జగన్.. తన కేబినెట్ నుంచి ఎవరిని బయటకు పంపినా.. కొడాలి నానికి మాత్రం కొత్త కేబినెట్‌లో  కూడా బర్త్ కన్‌ఫార్మ్ అని.. మరో రెండున్నరేళ్లు మంత్రిగా కొడాలి నాని హావా కొనసాగుతోందనే చర్చ అయితే అటు తాడేపల్లి ప్యాలెస్‌లో.. ఇటు గుడివాడ నియోజకవర్గంలో కూడా వైరల్ అయింది. ఇదే విషయం సోషల్ మీడియాలో కూడా వైరల్ అయింది. 

జగన్ కేబినెట్‌లో చంద్రబాబు అండ్ కోని టార్గెట్ చేయాలంటే.. అందుకు కొడాలి నానినే కరెక్ట్ పర్సన్ అన్న సంగతి ఫ్యాన్ పార్టీలోని నేతలందరికీ తెలుసు.  అలాంటిది.. కొడాలి నానిని మంత్రి పదవి నుంచి తొలగిస్తారంటూ ప్రచారం జరగడం పట్ల ఆయన సహచర మంత్రులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అలాంటి నానికి సీఎం జగన్ ఎందుకు చెక్ పెడుతున్నారంటే.. ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. అయితే గుడివాడలో ఇటీవల చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో కొడాలి నానిని మంత్రుల జాబితాలో నుంచి సీఎం జగన్ తొలగించారనే టాక్ అయితే ప్రస్తుతం హాట్ హాట్‌గా ఓ చర్చ అయితే  నడుస్తోంది.  

గుడివాడ పట్టణంలో ఇటీవల మున్సిఫల్ వైస్ చైర్మన్ ఆడపా బాబ్జీ మృతి చెందారు. అయితే ఆయన మృతికి మంత్రి కొడాలి నానినే కారణమనే టాక్ కూడా పట్టణంలో ఉంది. అంతేకాదు.. 2014 ఎన్నికల్లో కొడాలి నాని గెలుపు కోసం.. ఆడపా బాబ్జీ బావమరిది వంకా విజయ్ కోట్లు కుమ్మరించడం.. ఆ తర్వాత కొడాలి నాని .. అతడినికి నగదు చెల్లించకపోవడం.. ఆ క్రమంలో అతడు ఆత్మహత్య చేసుకోవడం..  అతడు తన ఆత్మహత్యకు ముందు కొడాలి నానినే తన ఆత్మహత్యకు కారణమంటూ సూసైడ్ నోట్ రాయడం.... ఆ తర్వాత ఈ సూసైడ్ నోట్‌ను కొడాలి నాని అండ్ కో సైడ్ చేసిందని.. ఆ తర్వాత ఆ నగదంతా అడపా బాబ్జీనే చెల్లించడం.. అనంతరం ఆడపా బాబ్జీ కూడా కొడాలి నానికి భారీ మొత్తంలో నగదు ఇవ్వడం.. అవి కూడా మంత్రి నాని చెల్లించకపోవడంతో.. బాబ్జీ తీవ్ర మనోవేదనకు గురై మరణించినట్లు పట్టణంలో ఓ టాక్ అయితే షికార్ చేస్తోంది. ఆ క్రమంలో ఆడపా బాబ్జీ మృతికి నీవే కారణమంటూ.. గుడివాడలో ఓ యువకుడు సాక్ష్యాత్తూ మంత్రి నాని కాలర్ పట్టుకోవడం.. అక్కడే ఉన్న భద్రత సిబ్బంది వెంటనే స్పందించి.. సదరు యువకుడిని మంత్రి కొడాలి నాని నుంచి దూరంగా పంపడం అంతా క్షణాల్లో జరిగిపోయిందట. అయితే ఇదే విషయాన్ని ప్రతిపక్ష టీడీపీ అయితే ప్రెస్‌మీట్ పెట్టి.. మరీ  కొడాలి నాని దీనిపై స్పందించాలంటూ డిమాండ్ కూడా చేసింది. అదీకాక.. గుడివాడ పట్టణంలోని యువతపై ఆడపా బాబ్జీకి మంచి పట్టు ఉంది. అతడి మాటే వారికి వేదం.. ఎన్నికల్లో అతడు ఏ పార్టీ వైపు పని చేయమంటే.. ఆ పార్టీకి యుద్ధ సైనికుల్లా పని చేసేందుకు ఆ యువతంతా సమాయత్తమవుతోంది. 

అలాంటి ఆడపా బాబ్జీ ఆకస్మిక మరణంతో.. యువతను గైడ్ చేసే నాయకుడే లేకుండా పోయారనే చర్చ గుడివాడలో సాగుతోంది. మరోవైపు బాబ్జీ మృతితో పట్టణ యువతలో అప్పుడే గ్రూపులు మొదలైయ్యాయనే చర్చ కూడా నడుస్తోంది. అదీకాక.. గుడివాడ పట్టణ ప్రాంతంలో యువత ఓట్లే అభ్యర్థి గెలుపును నిర్దేశిస్తాయి. ఈ నేపథ్యంలో ఆ ఓట్లు భారీగా చీలిపోయే అవకాశాలున్నాయని.. పట్టణంలోని పలువురు పేర్కొంటున్నారు. ఎన్నికల నాటికి పరిస్థితులు పూర్తిగా మారిపోతాయని.. ఆ క్రమంలో కొడాలి నాని.. పరిస్థితి ఘోరంగా మారే అవకాశం లేకపోలేదని సమాచారం. అలాంటి పరిస్థితుల్లో కొడాలి నానిని మంత్రి వర్గంలో ఉంచే కంటే.. నియోజకవర్గంలో యువత ఓట్లు చీలకుండా ఉండేలా.. రానున్న ఎన్నికల్లో పార్టీని మరింత పటిష్టంగా చేసేందుకు ప్రయత్నించాలని కొడాలి నానికి సీఎం జగన్ సూచించినట్లు తెలుస్తోంది.