జియోలోకి పెట్టుబడుల వెల్లువ.. కేకేఆర్ రూ.11,367 కోట్ల పెట్టుబడి
posted on May 22, 2020 10:22AM
రిలయన్స్ డిజిటల్ యూనిట్ జియోలోకి పెట్టుబడులు వెల్లువెత్తుతున్నాయి. పలు అంతర్జాతీయ సంస్థలు జియోలో పెట్టుబడి పెట్టేందుకు ఆసక్తి చూపుతున్నాయి. తాజాగా, న్యూయార్క్కు చెందిన గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ కంపెనీ కేకేఆర్ జియోలో రూ.11,367 కోట్లు పెట్టుబడిగా పెట్టాలని నిర్ణయించింది. దీంతో జియోలో 2.32 శాతం వాటా కేకేఆర్ సొంతం చేసుకోనుంది. ఈ మేరకు రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (ఆర్ఐఎల్) శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేసింది. ఇది ఆసియాలోనే అతిపెద్ద పెట్టుబడి కానుందని ఆర్ఐఎల్ తెలిపింది. ఈ పెట్టుబడితో జియో ప్లాట్ఫామ్స్ ఈక్విటీ విలువ రూ. 4.91 లక్షల కోట్లకు, ఎంటర్ప్రైజెస్ విలువ రూ. 5.16 లక్షల కోట్లకు చేరనుందని తెలిపింది.
కాగా, గత నెలలో ఫేస్బుక్ జియోలో రూ. 43,574 కోట్లు పెట్టుబడి పెట్టిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత సిల్వర్ లేక్, విస్టా, జనరల్ అట్లాంటిక్ సంస్థలు కూడా జియోలో పెట్టుబడులు పెట్టాయి. తాజాగా కేకేఆర్ కూడా ఈ జాబితాలో చేరడంతో.. జియో కొద్ది కాలంలోనే రూ. 78,562 కోట్ల పెట్టుబడులను సేకరించింది.