పేదలకు అండగా గరీబ్ కళ్యాణ్ యోజన!
posted on Mar 26, 2020 8:00PM
ప్రజా ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని నిరుపేదలను ఆదుకోవాలనే దృఢ సంకల్పంతో కేంద్ర ప్రభుత్వం పని చేస్తోందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి చెప్పారు. ఢిల్లీలో కరోనా(corona) నివారణకు ఏర్పాటుచేసిన కంట్రోల్ రూమ్ నుండి లాక్ డౌన్ పై ఆయన పర్యవేక్షిస్తున్నారు. లాక్ డౌన్ లో భాగంగా తెలంగాణలోని 17 జిల్లా కలెక్టర్లతో స్వయంగా మాట్లాడారు.
ఆయా జిల్లాలలో లాక్ డౌన్ తో అందరికీ నిత్యావసర వస్తువులు,కూరగాయలు అందుబాటులో ఉండే విధంగా , స్థానికంగా గ్రామీణ ప్రాంతాల్లో, పట్టణ ప్రాంతాల్లో లో శానిటేషన్ విషయంలో ప్రభుత్వ ఆస్పత్రుల పనితీరును అత్యవసర ఈ పరిస్థితులలో ప్రజలకు సౌకర్యాలను కల్పిస్తున్న సౌకర్యాలు వెసలుబాటు విషయంలో కూడా ఎప్పటికప్పుడు సమీక్ష చేస్తున్నారు.
తెలంగాణ రాష్ట్రంలో 17 జిల్లాల కలెక్టర్లతో స్వయంగా కిషన్ రెడ్డి మాట్లాడినప్పుడు ఆయా జిల్లా కలెక్టర్లు సమాచారాన్ని, అక్కడున్న పరిస్థితులను, సమస్యలను, తీసుకుంటున్న చర్యలను, సమాచారాన్ని ఇచ్చారు. ఆయా సమస్యల పరిష్కారానికి కేంద్ర ప్రభుత్వం నుండి పూర్తి సహాయ సహకారాలు అందించడానికి సిద్ధంగా ఉన్నట్లు కిషన్ రెడ్డి గారు తెలిపారు.
అదేవిధంగా అన్ని రాష్ట్రాలలో ఉన్నటువంటి పరిస్థితులను కంట్రోల్ రూమ్ ద్వారా సమీక్షిస్తూ తగిన సూచనలను ఇస్తున్నారు. ప్రజలందరూ కరోనా నివారణ చర్యలకు సహకరించాలని శ్రీ జి కిషన్ రెడ్డి విజ్ఞప్తి చేశారు.
కరోనా నేపథ్యంలో పేద ప్రజలను ఆదుకునేందుకు ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలోని ఎన్ డి ఏ ప్రభుత్వం నడుం బిగించి గరీబ్ కళ్యాణ్ యోజన ప్రకటించిందని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి జి కిషన్ రెడ్డి తెలిపారు. గరీబ్ కళ్యాణ్ పథకంలో భాగంగా 80 కోట్ల మంది పేదలకు కేంద్రం 1 లక్ష 70 వేల కోట్ల రూపాయల లాభాలను అందిస్తుందని ఆయన అన్నారు.
1. రానున్న 3 నెలలు ఒక్కొక్కరికి నెలకు 5 కిలోల బియ్యం
2. 8.69 కోట్ల మంది రైతులకు తక్షణమే రూ 2,000
3. పెన్షనర్లకు, పేదలకు, వృద్ధులకు, దివ్యాన్గులకు, భర్త లేని వారికి రూ 1,000
4. జన్ ధన్ ఖాతా ఉన్న మహిళలకు రాబోయే మూడు నెలలు పాటు నెలకు రూ 500
5. ఉజ్వల కనెక్షన్ ఉన్నవారికి 3 నెలల పాటు ఉచితంగా గ్యాస్ సిలిండర్ల పంపిణీ
6. వైద్యులకు, ఆశ వర్కర్లకు, పారిశుధ్య కార్మికులకు 50 లక్షల భీమా
7. ఉపాధి హామీ కూలీని రూ 182 నుండి రూ 202 లకు పెంపు
8. స్వయం సేవక మహిళా గ్రూపులకు ఇచ్చే రుణాన్ని 10 లక్షల నుండి 20 లక్షలకు పెంపు
9. ఉద్యోగాలను కాపాడేందుకు 100 మంది కంటే తక్కువ ఉన్న కంపెనీల్లో పని చేసే వారికి యాజమాన్యం, ఉద్యోగస్తులు చెల్లించే పిఎఫ్ ను ప్రభుత్వమే చెల్లిస్తుంది
10. ఉద్యోగస్తులు 75 శాతం పిఎఫ్ ను విత్డ్రా చేసుకునే వెసలుబాటు