జగన్ కు షాక్ ఇస్తున్న కిరణ్ కుమార్ రెడ్డి
Published on: Mon May 14, 2012 11:54AM
తన పదవికి, రాజకీయ భవిష్యత్తుకు ముప్పువాటిల్లుతుందనే భయంతోనే ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్ పై విమర్శలు కురిపించినట్టు పరిశీలకులు భావిస్తున్నారు. ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైన ప్రభుత్వాన్ని కూల్చడానికి జగన్ ప్రయత్నించారని, లక్ష చదరపు అడుగుల్లో ఇళ్ళు ... 75 పడక గదులతో ఇళ్ళు కట్టుకున్న జగన్ పదవికోసం వెంపర్లాడుతున్నాడంటూ కిరణ్ కుమార్ రెడ్డి ఉప ఎన్నికల ప్రచారంలో నేరుగా జగన్ పై విరుచుకుపడ్డారు.
అంతేగాక వై.ఎస్. రాజశేఖర రెడ్డి తండ్రి రాజారెడ్డి జైలులో ఉంటే తన తండ్రే విడిపించారని కూడా ముఖ్యమంత్రి కిరణ్ తెలిపారు. ముఖ్యమంత్రిగా కుర్చీ ఎక్కిన నాటినుంచి జగన్ ను పల్లెత్తుమాట కూడా అన్ని కిరణ్ నేడు తీవ్రమైన స్థాయిలో జగన్ పై ఆరోపణలు చేయకపోతే తన రాజకీయమనుగడ వుండదని ఆయన గుర్తించడమే కారణమని రాజేకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. జగన్ కు కిరణ్ అత్యంత సన్నిహితుడని, నిజానికి కిరణ్ ప్రభుత్వం, వై.ఎస్. జగన్ కు కోవర్టుగా పనిచేస్తోందన్న ఆరోపణలు నిజమనే భావన ప్రజలలో కలగడమే కాకుండా చివరకు అధిస్థానం కూడా నమ్మే పరిస్థితి ఏర్పడింది. దాంతో ఉప ఎన్నికల తర్వాత కిరణ్ కు పదవీగండం తప్పదనే వార్తలు వస్తున్నాయి. ఈ స్థితిలో పదవిని కాపాడుకోవాలంటే ఉప ఎన్నికల్లో జయాపజయాల సంగతి ఎలావున్నప్పటికీ కనీసం తాను జగన్ కు కోవర్టును కాననే విషయాన్ని అయినా రుజువు చేసుకోవాల్సిన పరిస్థితి కిరణ్ కు ఏర్పడింది.
ఈ నేపథ్యంలో ఆయన జగన్ పై విమర్శలు సంధించడం ప్రారంభించారు. ఇప్పటి వరకు జగన్ కోవర్టుగా భావించిన కిరణ్ కూడా స్వయంగా జగన్ అవినీతిని, విలాసవంతమైన భవనాల గురించి ప్రస్తావించడంతో ఆ ప్రభావం ఎంతోకొంత ఓటర్లపై చూపించడంతోపాటు జగన్ కు నాస్తం కలిగిస్తుందని భావిస్తున్నారు.


