TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

కింగ్ సాధించాడు.. ఆర్సీబీని మురిపించాడు!

Published on: Wed Jun 4, 2025 2:32AM

ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 18 ఏళ్ల నిరీక్షణ. 2008లో ఐపీఎల్ తొలి సీజన్ నుంచి ఆర్సీబీ లో భాగమైన కోహ్లీ ఈ 18 ఏళ్లూ అదే జట్టు తరఫున ఆడాడు. ఆర్సీబీతో ఎమోషనల్ గా పెనవేసుకుపోయాడు. ఆర్సీబీ ఐపీఎల్ టైటిల్ కోసం చెమటోడ్చాడు. రక్తం ధారపోశాడు. ఇన్నేళ్లుగా ఒకే ఫ్రాంఛైజ్ కు కట్టుబడి ఆడిన ఏకైక ఆడగాడు విరాట్ కోహ్లీయే. 

విరాట్ కోహ్లీ క్రికెట్ ప్రస్థానంలో అండర్ 19 వరల్డ్ కప్ నుంచి మొదలు పెడితే.. వన్డే, టి20 వరల్డ్ కప్ లు, చాంపియన్స్ ట్రోఫీ వంటి ఎన్నో ప్రతిష్ఠాత్మక టోర్నీలలో విజేత జట్టుకు ప్రాతినిథ్యం వహించాడు. భారత క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ తరువాత అంతటి ప్రతిభ, ప్రావీణ్యం ఉన్న ఆటగాడిగా ప్రపంచ వ్యాప్తంగా లెంజడరీ క్రికెటర్లందరి ప్రశంసలూ అందుకున్నాడు. రెండు, మూడు మినహా  సచిన్ రికార్డులన్నిటినీ తిరగరాసి రన్ మెషీన్ గా, పరుగుల దాహం తీరని బ్యాటర్ గా కోట్లాది మంది అభిమానులను సంపాదించుకుని కింగ్ కోహ్లీ అయ్యాడు. అటువంటి విరాట్ కోహ్లీకి ఐపీఎల్ ట్రోఫీ ఇంత కాలం అందని ద్రాక్షగానే ఊరిస్తోంది. వరుసగా 17 ఏళ్ల పాటు ట్రోఫీ గెలవలేకపోయిన జట్టుకు మరే జట్టుకూ లేనంత బలమైన ఫ్యాన్ బేస్ ఉందంటే అందుకు కారణం విరాట్ కోహ్లీయే అనడంలో సందేహం లేదు. తన ఆశలనే కాదు.. ఆర్సీబీ ఐపీఎల్ ట్రోపీ దక్కించుకుని తీరాలన్న కోట్లాది మంది అభిమానుల ఆశలను కూడా విరాట్ కోహ్లీయే ఇంత కాలం ఒంటి చేత్తో మోస్తూ సాగాడు. ఇప్పుడు తన కల నెరవేర్చుకోవడమే కాదు.. అభిమానుల ఆశ కూడా తీర్చి గోప్ప రీలీఫ్ పొందాడు. 

విజయానంతరం విరాట్ కోహ్లీ భావోద్వేగానికి లోనయ్యాడు. జట్టు సహచరులతో కలిసి మైదానమంతా కలియతిరిగాడు. ఉత్సాహం పట్టలేక ఉరకలేశాడు. ఆ ఆనందం అందరికీ 2008 నాటి యువ కోహ్లీని తలపించింది. తన భార్య అనుష్కశర్మను హత్తుకుని విజయానందాన్ని పంచుకున్నాడు. అలాగే ఏబీ డివిలియర్స్, క్రిస్ గేల్ వంటి ఆర్సీబీ మాజీ సహచరులతో ఆనంద క్షణాలను పంచుకున్నాడు.