TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

ఆనందంతో కరిగి కన్నీరైన క్రికెట్ కింగ్

Published on: Wed Jun 4, 2025 2:00AM

ఆర్సీబీ విజయంతో క్రికెట్ కింగ్ విరాట్ కోహ్లీ కరిగి కన్నీరయ్యాడు. ఉద్వేగానికి లోనయ్యాడు. 18 ఏళ్లుగా ఆర్సీబీ విజయం కోసం తన సర్వశక్తులూ ధారపోసిన కోహ్లీ అది సాధించిన అనంతరం ఆనందం పట్టలేక కన్నీరు పెట్టుకున్నాడు. మైదానంలో మోకాళ్ల మీద కూలబడి కన్నీరుమున్నీరయ్యారు. ఆ తరువాత జట్టు సహచరులతో, ఆర్సీబీ మాజీ ప్లేయర్లు ఏబీడివిలియర్స్, క్రిస్ గేల్ లతో తన ఆనందాన్ని పంచుకున్నాడు. భార్య అనుష్కశర్మను హత్తుకుని మరోసారి కన్నీళ్లు పెట్టుకున్నాడు.ఐపీఎల్ ఆరంభం నుంచీ ఇప్పటి వరకూ జరిగిన 18 సీజన్లలోనూ ఒకే జట్టుకు ఆడిన ఏకైక ఆటగాడు ఎవరైనా ఉన్నారంటే అది కోహ్లీ ఒక్కడే. 

విజయం అనంతరం మాట్లాడిన కోహ్లీ ఈ విజయం తనకు, జట్టుకు, ఆర్సీబీ ఫ్యాన్ బేస్ కూ ఎంతో ముఖ్యమైనది, విలువైనది అని చెప్పాడు. ఈ 18 ఏళ్లుగా ప్రతి ఐపీఎల్ సీజన్ లోనూ తాను విజయం కోసమే ఆడానని చెప్పిన కోహ్లీ.. ఆర్సీబీ కోసం తాను సర్వశక్తులూ ఒడ్డాననీ, ఈ విజయం తనకు ఒక అద్భుత అనుభూతి అనీ వివరించాడు. 

ఏ విధంగా చూసినా ఐపీఎల్ చరిత్రలో 2005 సీజన్ చిరస్మరణీయంగా నిలిచిపోతుంది. ఈ 18 ఏళ్ల ఐపీఎల్ ప్రస్థానంలో ఇంతటి భావోద్వేగమైన ముగింపు ఇదే ప్రథమం.  పలుసార్లు ట్రోఫీ గెలిచిన జట్లకు కూడా లేనంత బలమైన ఫ్యాన్ బేఃస్ ను సొంతం చేసుకున్న జట్టు ఆర్సీబీ. గత 18 ఏళ్లలో మూడు సార్లు ఫైనల్స్ వరకూ వచ్చి, మరెన్నో సార్లు లీగ్ దశ దాటి నాకౌట్ దశకు వచ్చినప్పటికీ కప్ అందుకోవాలన్న కలకలాగే మిగిలిన జట్టు.  ఎట్టకేలకు నాలుగో సారి ఫైనల్ ఆడుతూ కప్పును ముద్దాడింది. అయితే ఇది కేవలం టైటిల్ విజయం కాదు.. 17 ఏళ్ల పోరాటానికి దక్కిన ఫలితం. ఎన్నో అవమానాలకు, ట్రోలింగ్ లకు చెప్పిన సమాధానం. వీటన్నిటి వెనుకా ఉన్నది ఒకే ఒక్కడు విరాట్ కోహ్లీ. అందుకే ఈ విజయాన్ని, కప్ ను విరాట్ కోహ్లీకి అంకితమిస్తున్నట్లు ప్రకటించాడు జట్టు కెప్టెన్ పటీదార్