విలేకరులైనా దందా చేస్తే శిక్ష తప్పదు! చట్టానికీ అతీతులుకారు!
posted on Apr 6, 2020 3:41PM
జర్నలిస్ట్లు చట్టానికి అతీతం కాదు? నైతికతకు విరుద్ధంగా విలేకరులు ఏం చేసినా చెల్లుతుందనుకోవడం దారుణమే! లాక్డౌన్ నడుస్తోంది. సదరు పత్రికకు స్థానికంగా విలేకరి వున్నాడు. ఏదైనా వివరణ కావాల్సి వస్తే అతనితో తెప్పించుకోవచ్చు. కానీ అలా జరగలేదిక్కడ. తమకు అవసరం అనుకున్నారేమో 80 కిలో మీటర్ల వరకు ప్రయాణం చేసి ఓ రాజకీయ నేతతో బేరం పెట్టుకున్నారు. అతను గుట్టుగా మొత్తం వ్యవహారం రికార్డు చేసి జర్నలిస్టుల బతుకు రోడ్డు మీద కీడ్చాడు.
జర్నలిస్టులు రెడ్ హ్యాండెడ్గా పోలీసులకు పట్టుబడ్డారు. చట్ట విరుద్ధ చర్యలకు ఎవరు పాల్పడినా, విలేకరులైనా, రాజకీయనేతలైనా చట్ట ప్రకారం శిక్ష పడాల్సిందే. అప్పుడే ఇతరులకు బుద్ధి వస్తుంది. ఇలాంటి సంఘటనలు మళ్ళీ పునరావృత్తం కావు. ఇలాంటి సందర్భాల్లో జర్నలిస్టు సంఘాలు జర్నలిస్టులను వెనకేసుకొని రాకుండా వాస్తవాల్ని గ్రహించి నిజాయితీతో ఖండించాల్సిన అవసరం వుంది. అసలు విజయబాబు ఇంటికి ఎందుకు వెళ్ళారు? బ్లాక్ మెయిల్ చేయడం నేరం కాదా. ప్రజలు జర్నలిస్టులను అసహించుకునే దుస్థితి రాకుండా చూసుకోవాల్సిన సమయం ఇది. జర్నలిజం వ్యవస్థను సర్వనాశనం చేస్తున్నారు. ఇది పెద్ద కళంకం.
జడ్జి లాంటి వాడు జర్నలిస్ట్. అయితే ముద్దాయిలా ఎందుకు విజయబాబు ఇంటికి వెళ్ళారు. మీ స్థానిక విలేకరి అక్కడున్నా 80 కిలోమీటర్లు ప్రయాణం చేసి వివరణ కోసం వెళ్ళారు సరే. బేరసారాలు ఎందుకు ఆడాల్సి వచ్చింది. ఆ వీడియోకు ఏం సమాధానం చెబుతారు?
తాను నిజాయితీగా పని చేశానని, తనపై నిరాధార వార్తలు రాస్తూ డబ్బులు డిమాండ్ చేశారని మువ్వా చెబుతున్నారు. కనీసం 15 లక్షల రూపాయలు అయినా ఇస్తే తాము కథనాలు రాయడం నిలిపి వేస్తామని వారు చెప్పినట్లు విజయ్ బాబు తెలిపారు. అయితే తాను అంత ఇవ్వలేని ఆయన స్పష్టం చేశారు. చివరకు ఐదు లక్షల రూపాయల నగదు, 500 పత్రికలకు సంవత్సర చందా కట్టే విధంగా ఒప్పందం కుదిరింది.
మాజీ డీసీసీబీ చైర్మన్ మువ్వా విజయ్బాబు ఫిర్యాదు మేరకు విలేకరులయిన మూర్తి, సత్యనారాయణ, శ్రీకాంత్ లపై ఒక బెయిబుల్, మరో నాన్ బెయిబుల్ సెక్షన్ ల తోకూడిన కేసు నమోదు అయింది.