TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

ఖమ్మం, వరంగల్, కరీంనగర్ కార్పొరేషన్‌లకు రింగ్ రోడ్డు : సీఎం రేవంత్‌రెడ్డి

Published on: Wed May 13, 2026 9:32PM

 

హైదరాబాద్‌లోని ఎంసీఆర్‌హెచ్‌ఆర్‌డీ పెవిలియన్‌లో మెగా గ్రోత్ కారిడార్ ప్రణాళికలపై ముఖ్యమంత్రి సీఎం రేవంత్‌రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి సీఎంఓ కార్యదర్శి మాణిక్ రాజ్, తెలంగాణ మునిసిపల్ అడ్మినిస్ట్రేషన్ కమిషనర్ & డైరెక్టర్ డాక్టర్ టి.కె. శ్రీదేవి, డైరెక్టర్ ఆఫ్ టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ దేవేందర్ రెడ్డి తదితర ఉన్నతాధికారులు హాజరయ్యారు.

ఈ సందర్భంగా సీఎం పలు కీలక సూచనలు చేశారు. ఖమ్మం, వరంగల్, కరీంనగర్ కార్పొరేషన్లకు ఔటర్ రింగ్ రోడ్లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని అవసరమైన ఎస్టీపీలు డిజైన్ చేయాలని సూచించారు. రాబోయే ఎయిర్‌పోర్టులను అనుసంధానించేలా రోడ్ల నిర్మాణం చేపట్టాలని పేర్కొన్నారు.

అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణాల్లో ఆధునిక సాంకేతికత వినియోగించాలని, ఖర్చులు తగ్గించేందుకు ఈవీ వాహనాలను ప్రోత్సహించాలని సూచించారు. ప్రతి ప్రాంతంలో పునరుత్పాదక విద్యుత్ ఉత్పత్తికి ప్రాధాన్యం ఇవ్వాలని, మున్సిపాలిటీల్లో సోలార్ ఎనర్జీ ప్లాంట్లు ఏర్పాటు చేయాలని తెలిపారు.

సాలిడ్ వేస్ట్ మేనేజ్‌మెంట్ ప్లాంట్లు, వేస్ట్ వాటర్ ట్రీట్‌మెంట్ ప్లాంట్లు అర్బన్ ప్లానింగ్‌లో తప్పనిసరిగా ఉండాలని సీఎం స్పష్టం చేశారు. పట్టణాలు, నగరాల్లో రేడియేషన్ ప్రభావం తగ్గించేందుకు మల్టీ యుటిలిటీ టవర్స్ ఏర్పాటు చేయాలని సూచించారు. ట్రాఫిక్ నియంత్రణలో ఏఐ సాంకేతికత వినియోగంపై నిపుణుల సలహాలు తీసుకోవాలని ఆదేశించారు.

సీవరేజ్ అండ్ వేస్ట్ వాటర్ మేనేజ్‌మెంట్ బోర్డు ద్వారా శుద్ధి చేసిన నీటినే భవన నిర్మాణాల్లో వినియోగించేలా నిబంధనలు రూపొందించాలని పేర్కొన్నారు. సింగరేణి పరిధిలోని అన్ని మున్సిపాలిటీలను ఒక యూనిట్‌గా అభివృద్ధి చేయాలని, సింగరేణి సీఎస్ఆర్ నిధులను స్థానికంగానే ఖర్చు చేయాలని సూచించారు.

అలాగే నల్గొండ–యాదగిరిగుట్ట మధ్య టెంపుల్ కారిడార్, ఆదిలాబాద్–నాగోబా–బాసర–కడెం ప్రాజెక్టులను కలుపుతూ టూరిజం కారిడార్ ఏర్పాటు చేయాలని సీఎం సూచించారు. కృష్ణా పుష్కరాలను దృష్టిలో ఉంచుకుని అలంపూర్ జోగులాంబ ఆలయాన్ని అభివృద్ధి చేయాలని పేర్కొన్నారు.

మహబూబ్‌నగర్, భూత్పూర్, జడ్చర్లను కలుపుతూ ప్రత్యేక కారిడార్, కొత్తగూడం–పాల్వంచ–సుజాతనగర్ ప్రాంతాలను అనుసంధానిస్తూ మరో కారిడార్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు.

వచ్చే 25 ఏళ్ల అవసరాలను దృష్టిలో ఉంచుకుని అన్ని ప్రణాళికలు రూపొందించాలని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. వరంగల్, కరీంనగర్, ఖమ్మం కారిడార్లు భవిష్యత్ తెలంగాణ అభివృద్ధికి ఎంతో కీలకమని పేర్కొన్నారు.