TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

కాంగ్రెస్ పోవాలి...కేసీఆర్ రావాలి : తలసాని

Published on: Sat Jun 6, 2026 8:23PM

 

తెలంగాణ భవన్‌లో ఖైరతాబాద్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నేతల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి మాజీ మంత్రి, బీఆర్ఎస్ పార్టీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ తలసాని శ్రీనివాస్ యాదవ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఈ నెల 14న ఖైరతాబాద్ నియోజకవర్గ స్థాయి సమావేశాన్ని నిర్వహించనున్నట్లు తెలిపారు. ప్రత్యేక ఓటరు సవరణ (SIR) కార్యక్రమంపై పార్టీ నాయకులు, కార్యకర్తలు పూర్తి అవగాహన కలిగి ఉండాలని సూచించారు.

18 సంవత్సరాలు నిండిన ప్రతి యువకుడు ఓటరుగా నమోదు చేసుకునేలా బూత్ లెవల్ ఏజెంట్లు బాధ్యతగా వ్యవహరించాలని కోరారు. అలాగే ఇంటింటికీ వెళ్లి పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని విస్తృతంగా చేపట్టాలని పిలుపునిచ్చారు. ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను అమలు చేసిందా లేదా అనే విషయాన్ని ప్రజలను ప్రశ్నించాలని సూచించారు. పార్టీ కోసం అంకితభావంతో పనిచేస్తున్న కార్యకర్తలకు బీఆర్ఎస్ అన్ని విధాలుగా అండగా ఉంటుందని స్పష్టం చేశారు. కష్టపడి పనిచేసే వారికే పార్టీలో సముచిత స్థానం, గుర్తింపు లభిస్తాయని అన్నారు.

పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని కేసీఆర్ నాయకత్వంలో అభివృద్ధి పథంలో నడిపించామని పేర్కొన్నారు. పార్టీ నాయకులు, కార్యకర్తల గౌరవాన్ని పెంచిన గులాబీ జెండాను మరింత బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు. పార్టీని వీడి వెళ్లిపోయిన వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ తిరిగి పార్టీలోకి తీసుకునే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

మోసాలు, అబద్ధాలకు కాంగ్రెస్ పార్టీ పెట్టింది పేరని విమర్శించిన తలసాని, ఎన్నికల ముందు ఇచ్చిన హామీల అమలు గురించి ప్రశ్నిస్తే ముఖ్యమంత్రి ప్రజలను బెదిరించే విధంగా మాట్లాడుతున్నారని ఆరోపించారు. కేసీఆర్ ప్రభుత్వం అప్పులు చేసినప్పటికీ వాటిని అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల కోసం వినియోగించిందని అన్నారు. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండున్నరేళ్లలో సుమారు రూ.4 లక్షల కోట్ల అప్పులు చేసిందని, ఆ నిధులతో ఏం అభివృద్ధి చేసిందో ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు.

కాంగ్రెస్ పాలనతో అన్ని వర్గాల ప్రజలు విసిగిపోయారని, రాష్ట్రవ్యాప్తంగా అసంతృప్తి పెరుగుతోందని పేర్కొన్నారు. ప్రజలు "కాంగ్రెస్ పోవాలి... కేసీఆర్ రావాలి" అని కోరుకుంటున్నారని అన్నారు. మరో రెండున్నర సంవత్సరాల తర్వాత తెలంగాణలో మళ్లీ అధికారంలోకి వచ్చేది కేసీఆర్ ప్రభుత్వమేనని ధీమా వ్యక్తం చేశారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికలు, ఎమ్మెల్యే ఎన్నికలు లేదా ఏ ఎన్నికలు వచ్చినా గెలిచేది, ఎగిరేది గులాబీ జెండానే అని తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు.