TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

మావోయిస్టుల పునరావాసంపై కీలక భేటీ

Published on: Thu Mar 5, 2026 9:15AM

తెలంగాణ రాష్ట్ర పరిపాలన, భద్రతా వ్యవస్థ బలోపేతంపై కీలక చర్చలు జరిపేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బుధవారం (మార్చి 4) ఢిల్లీలో కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు. దాదాపు గంటకు పైగా సాగిన ఈ భేటీలో  రాష్ట్ర భద్రతా పరిస్థి తులు, పెరుగుతున్న నగరీకరణకు అనుగుణంగా పోలీసు వ్యవస్థ పునర్వ్యవస్థీకరణ, మావోయిస్టుల లొంగుబాట్లు, పునరావాసం వంటి అంశాలపై చర్చ జరిగింది.  ఈ భేటీలో సీఎం రేవంత్ రెడ్డి వెంటన తెలంగాణ డీజీపీ  బి. శివధర్ రెడ్డి, ఇంటెలిజెన్స్ అడిషనల్ డీజీపీ విజయ్ కుమార్, ఎస్‌ఐబి ఐజీ బి. సుమతి తదితర ఉన్నతాధికారులు ఉన్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణకు ప్రభుత్వం చేపట్టిన చర్యలను, ముఖ్యంగా సైబర్ నేరాల నియంత్రణలో అమలు చేస్తున్న వ్యూహాలను సీఎం ఈ సందర్భంగా కేంద్ర హోంమంత్రికి వివరించారు. 

హైదరాబాద్ మహానగర విస్తరణతోపాటు డిజిటల్ రంగం వేగంగా అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో సైబర్ నేరాల నియంత్రణ కీలకమైందని సీఎం ప్రస్తావించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో చేపడుతున్న చర్యలు, అంతర్రాష్ట్ర మోసగాళ్లపై జరుగుతున్న ఆపరేషన్ల వివరాలను రేవంత్ అమిత్ షాకు పూసగుచ్చినట్లు చెప్పారు. భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని ప్రత్యేక శిక్షణ పొందిన అధికారుల అవసరం పెరుగుతోందన్నారు.   

ఇటీవల హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజిగిరి పోలీసు కమిషనరేట్ల పునర్వ్యవస్థీకరణతో పాటు కొత్తగా  ఫ్యూచర్ సిటీ కమిషనరేట్ ఏర్పాటు చేసిన విషయాన్నికేంద్ర హోంమంత్రికి వివరించిన సీఎం రేవంత్.. వేగంగా పెరుగుతున్న జనాభా, పట్టణ విస్తరణ, పరిశ్రమల వృద్ధి దృష్ట్యా రాష్ట్రానికి మరిన్ని ఐపీఎస్ అధికారుల అవసరం ఉందని, తెలంగాణ ఐపీఎస్ క్యాడర్ సంఖ్యను పెంచాలని కోరారు.  

రాష్ట్రంలో ఇటీవల అజ్ఞాతాన్ని వీడి బయటకు వచ్చిన మావోయిస్టు నాయకుల అంశం కూడా ఈ భేటీలో చర్చకు వచ్చింది. గత రెండేళ్లలో మొత్తం 591 మంది మావోయిస్టులు ఆయుధాలు వదిలి   జీవన స్రవంతిలో కలిశారు.   లొంగిపోయిన  మావోయిస్టులకు  ప్రభుత్వం అందిస్తున్న పునరావాస ప్యాకేజీలు, నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు, ఉపాధి అవకాశాల గురించి సీఎం ఈ భేటీలో అమిత్ షాకు వివరించారు. 
మిగిలిన మావోయిస్టు నేతల లొంగుబాటుకు అనుకూల వాతావరణం కల్పించేందుకు కేంద్రం, రాష్ట్రం సమన్వయం అవసరమని సీఎం అభిప్రాయపడ్డారు.

వెనుకబడిన ప్రాంతాల్లో అభివృద్ధి పనులకు కేంద్ర  మరింత సహకారం అందించాలని కోరారు. ఈసమావేశంలో ప్రస్తావించిన అంశాలపై కేంద్ర హోంమంత్రి సానుకూ లంగా స్పందించినట్లు తెలుస్తోంది. ఐపీఎస్ క్యాడర్ పెంపు, భద్రతా బలోపేతానికి అవసరమైన మద్దతు అంశాలపై పరిశీలించి నిర్ణయం తీసుకుంటామని హోంమంత్రి అమిత్ షా సీఎం రేవంత్ కు హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది.  ఈ భేటీతో రాష్ట్ర భద్రతా వ్యవస్థకు సంబంధించి కీలక నిర్ణయాలకు మార్గం సుగమమవుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.