TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

ఏపీ మద్యం స్కాంలో కీలక పరిణామం.. ఏం జరిగిందంటే?

Published on: Tue Jul 21, 2026 7:36AM

ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం కేసులో  కీలక మలుపు చోటుచేసుకుంది. ఈ కేసులో  అభియోగాలను ఎదుర్కొంటున్న  ఏపీఎస్‌బీసీఎల్ మాజీ మేనేజింగ్ డైరెక్టర్ దొంతిరెడ్డి వాసుదేవ రెడ్డితో పాటు మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు కుమారుడు కారుమూరి సునీల్, రాజ్ కసిరెడ్డిలకు విజయవాడలోని ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానం వచ్చే నెల 3 వరకూ   జ్యుడీషియల్ కస్టడీకి ఆదేశించింది.  సిట్ అధికారులు సమర్పించిన విచారణ నివేదికలు, ప్రాథమిక ఆధారాలను పరిశీలించిన   న్యాయస్థానం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది.

దర్యాప్తు ప్రక్రియలో భాగంగా ప్రస్తుతం హైదరాబాద్‌లోని చంచల్‌గూడ కేంద్ర కారాగారంలో రిమాండ్ ఖైదీలుగా ఉన్న ఈ ముగ్గురు నిందితులను ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) అధికారులు ప్రిజనర్ ట్రాన్సిట్ (పీటీ) వారెంట్‌పై ప్రత్యేక భద్రత నడుమ విజయవాడకు తరలించారు. విజయవాడలోని ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో వీరికి  వైద్య పరీక్షలు పూర్తి చేసిన అనంతరం, స్థానిక ఏసీబీ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి ఎదుట ప్రవేశపెట్టారు. కేసు తీవ్రతను పరిగణనలోకి తీసుకుని దర్యాప్తు అధికారి తమకు సమర్పించిన వివరాల ఆధారంగా నిందితులకు రిమాండ్ పొడిగించాల్సిన అవసరం ఉందని ప్రాసిక్యూషన్ వాదించింది.

కోర్టు విచారణ సందర్భంగా నిందితుల తరఫు న్యాయవాదులు, ప్రాసిక్యూషన్ న్యాయవాదుల మధ్య తీవ్రస్థాయిలో వాదనలు జరిగాయి. నిందితులు ఇప్పటికే ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్  నమోదు చేసిన కేసుల్లో అరెస్టయి జైలులో ఉన్నారని, కాబట్టి వారికి  41ఏ నోటీసులు జారీ చేసి విచారించాల్సి ఉందని నిందితుల తరఫు న్యాయవాదులు వాదించారు.  నిందితుల కుటుంబ సభ్యులు కలవడానికి అనువుగా వారిని అమరావతి లేదా విజయవాడ జైళ్లకు మార్చకుండా, తిరిగి హైదరాబాద్‌లోని చంచల్‌గూడ జైలులోనే ఉంచేలా ఆదేశాలు ఇవ్వాలని న్యాయస్థానాన్ని అభ్యర్థించారు.

దీనికి ప్రతిగా ప్రాసిక్యూటర్లు సిట్ సేకరించిన కీలక ఆధారాలను కోర్టు ముందు ఉంచారు. వైసీపీ హయాంలో ఏపీఎస్‌బీసీఎల్ మేనేజింగ్ డైరెక్టర్‌గా పనిచేసిన వాసుదేవ రెడ్డి   తన అధికారిక హోదాను దుర్వినియోగం చేస్తూ టెండర్ల నిబంధనలను నిబంధనలకు విరుద్ధంగా సవరించారని వివరించారు. అర్హత కలిగిన సంస్థలను పక్కనబెట్టి, నిర్దిష్ట సంస్థలకు అనుకూలంగా నిబంధనలు మార్చడం ద్వారా మద్యం రవాణా చార్జీలను భారీగా పెంచారని, దీనివల్ల ప్రభుత్వ ఖజానాపై తీవ్రమైన ఆర్థిక భారం పడిందని స్పష్టం చేశారు.

ఈ కుంభకోణంలో మాజీ మంత్రి కుమారుడైన కారుమూరి సునీల్   పాత్ర   క్రియాశీలంగా ఉందని సిట్ న్యాయస్థానానికి సమర్పించిన నివేదికలో పేర్కొంది. తన తండ్రికి ఉన్న రాజకీయ ప్రాభవాన్ని, ప్రభుత్వంలో ఉన్న పలుకుబడిని అడ్డం పెట్టుకుని మద్యం రవాణా కాంట్రాక్టర్ల ఎంపికలో అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపించింది. ఈ అక్రమ కేటాయింపుల ప్రక్రియలో సునీల్ సుమారు   16 కోట్ల రూపాయల మేర ముడుపులు స్వీకరించినట్లు దర్యాప్తులో తేలిందని తెలిపారు. ఇందుకు సంబంధించిన బ్యాంకింగ్ లావాదేవీల రికార్డులు, సందేశాలు, వాట్సాప్ చాటింగ్‌లతో కూడిన డిజిటల్ సాక్ష్యాలను కోర్టుకు అందజేశారు.

ఈ కేసులో గత ప్రభుత్వ హయాంలో జరిగిన మద్యం సరఫరా, రవాణా కాంట్రాక్టుల కేటాయింపుల్లో వ్యవస్థాగతమైన అవకతవకలు జరిగాయని సిట్ దర్యాప్తులో ప్రాథమికంగా నిర్ధారణ అయింది. మద్యం బాట్లింగ్ యూనిట్ల నుంచి డిపోలకు, డిపోల నుంచి విక్రయ కేంద్రాలకు సరుకును చేరవేసే రవాణా కాంట్రాక్టుల్లో అసలైన రేట్ల కంటే అధిక ధరలను ఆమోదించడం ద్వారా సుమారు రూ. 192 కోట్ల మేర ప్రభుత్వ సొమ్ము దుర్వినియోగానికి గురైందని సిట్ ప్రాథమిక నివేదిక స్పష్టం చేస్తోంది. ఈ మొత్తాన్ని వివిధ మార్గాల్లో అక్రమంగా మళ్లించినట్లు ఆరోపణలు ఉన్నాయి.

ఉభయ పక్షాల వాదనలను   విన్న విజయవాడ ఏసీబీ కోర్టు.. కేసు తీవ్రతను బట్టి నిందితులకు ఆగస్టు 3 వరకు జ్యుడీషియల్ కస్టడీ విధిస్తున్నట్లు పేర్కొంటూ.. వారిని తిరిగి చంచల్‌గూడ జైలుకే తరలించాలని  అధికారులను ఆదేశించారు. కోర్టు ఉత్తర్వుల అనంతరం సిట్ అధికారులు  నిందితులను తిరిగి హైదరాబాద్‌కు తరలించారు.  

Vasudeva Reddy, Karumuri Sunil, Vijayawada ACB Court, APSBCL Tender Scam