దేవినేని ఉమా వల్లే కొడాలి నానికి మంత్రిపదవి!!

 

కృష్ణా జిల్లాలోని విజయవాడ ఎంపీ సెగ్మెంట్‌ పరిధిలో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్ధులు ఓటమి పాలైనప్పటికీ ఎంపీగా కేశినేని నాని విజయం సాధించిన విషయం తెలిసిందే. అయితే కేశినేని కొద్ది రోజులుగా పార్టీ పట్ల అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఆయన అసంతృప్తికి ప్రధాన కారణం దేవినేని ఉమా అని ప్రచారం కూడా జరుగుతోంది. 

మరోవైపు తాజా పరిణామాలపై కేశినేని నాని ఫేస్‌బుక్‌లో  పోస్టులు పెడుతూ తన అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. కృష్ణా జిల్లాలోని గుడివాడ అసెంబ్లీ స్థానం నుండి విజయం సాధించిన కొడాలి నాని‌కి జగన్ మంత్రివర్గంలో చోటు దక్కింది. ఈ విషయమై కేశినేని నాని వ్యాఖ్యలు చేశారు. కొడాలి నాని  తనని మంత్రిని చేసిన దేవినేని ఉమాకి జీవితాంతం కృతజ్ఞుడిగా ఉండాలని తన ఫేస్ బుక్‌లో పోస్టు పెట్టాడు.

దేవినేని ఉమాకు, కేశినేని నానికి మధ్య విబేధాలు తలెత్తినట్లు తెలుస్తోంది. విజయవాడలో నూతన పార్టీ ఆఫీస్ నిర్మాణ బాధ్యత మొదట కేశినేనికి అప్పగించిన అధిష్టానం.. తరువాత ఉమాని రంగంలోకి దించింది. దీనికితోడు  పార్లమెంట్‌లో పార్టీ పదవుల కేటాయింపుల విషయంలో  కూడ కేశినేని నాని చంద్రబాబు తీరుపై అసంతృప్తితో ఉన్నారు. ఆ అసంతృప్తిని ఇలా ఫేస్‌బుక్‌ వేదికగా బయటపెడుతున్నారు.