ప్రజావేదిక కూల్చివేయండి.. కానీ? : కేశినేని నాని

 

ప్రజావేదికను కూల్చివేయాలని ఏపీ సీఎం జగన్ సంచలన నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ నిర్ణయంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా ఈ విషయంపై టీడీపీ నేత, విజయవాడ ఎంపీ కేశినేని నాని ఫేస్బుక్ వేదికగా స్పందించారు.

"ప్రజావేదిక అక్రమమో, సక్రమమో పక్కన పెడితే, అది ప్రజాధనంతో నిర్మించినటువంటి వేదిక. కాబట్టి ప్రజావేదికను తొలగించాలనుకుంటే, అక్రమ నిర్మాణాలన్ని తొలగించిన పిదప, ప్రజావేదికను చివర్లో తొలగిస్తే బావుంటుందని నా అభిప్రాయం.

ఇప్పుడు తొలగిస్తే రాష్ట్ర ఖజానాకు రెండు విధాలా నష్టం :-

1) ప్రజావేదికను ప్రజాధనంతో నిర్మించడం జరిగింది. కాబట్టి ఆ సొమ్ము వృథా అవుతుంది.

2) మరో వేదిక కట్టేవరకు ప్రభుత్వ సమావేశాలను నిర్వహించుకోవాలంటే ప్రైవేట్ వేదికలకు డబ్బు ఖర్చవుతుంది.

కాబట్టి ముందుగా మిగతా అక్రమ నిర్మాణాలను తొలగించి, ఈ లోపు కొత్త సమావేశ వేదిక నిర్మించి, అప్పుడు ఈ ప్రజావేదిక తొలగిస్తే బావుంటుందని నా అభిప్రాయం." అని పేర్కొన్నారు.