TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

40మంది ఎమ్మెల్యేలను టార్గెట్ చేసిన కేసీఆర్

Published on: Thu Jun 7, 2018 5:55PM

 

ప్రత్యేక రాష్ట్ర సాధనే లక్ష్యంగా తెరాస పార్టీని స్థాపించిన కెసిఆర్.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడటంతో, ప్రజల నమ్మకంతో సీఎం అయ్యారు.. కెసిఆర్ కూడా ఆయన మీద, ఆయన పార్టీ మీద ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని నిలిబెట్టుకునే దిశగా పరిపాలన చేస్తున్నారు.. చేస్తూనే వున్నారు. దానితో పాటే పార్టీని బలోపేతం చేసుకుంటూ వచ్చారు.. 2014 ఎన్నికల్లో 63 ఎమ్మెల్యే స్థానాలు గెలుచుకున్న తెరాస.. తర్వాత జరిగిన ఉప ఎన్నికల్లో మరికొన్ని స్థానాలు గెలిచింది.. అలానే ఇతర పార్టీల నుండి ఎమ్మెల్యేల చేరికతో.. తెరాస ఎమ్మెల్యేల సంఖ్య 90 కి చేరింది.

రోజురోజుకి పార్టీ బలోపేతం అవ్వడం, ప్రభుత్వ పథకాలు ప్రజల్లోకి వెళ్లడంతో వచ్చే ఎన్నికల్లో తెరాస కి తిరుగులేదనుకున్నారు.. కానీ ఒక నివేదిక కెసిఆర్ కే కాదు, ఆ పార్టీ సీనియర్ నాయకులకి కూడా షాక్ ఇచ్చిందట. ఇంతకీ ఆ నివేదిక ఏంటంటే.. 90 మంది తెరాస ఎమ్మెల్యేల పనితీరు ఎలా ఉందా? అని కెసిఆర్ ఒక నివేదిక తయారు చేయించారట. ఆ నివేదికే కెసిఆర్, ఎమ్మెల్యేలకు వార్నింగ్ ఇవ్వడానికి కారణం అయ్యిందంట.. ఆ నివేదికలో సుమారు 40 మంది ఎమ్మెల్యేల పనితీరు సరిగ్గా లేదని తెలిసిందట..వారిలో కొందరు మంత్రులు కూడా ఉన్నట్టు తెలుస్తుంది. మరీ 40 మంది ఎమ్మెల్యేల పనితీరు సరిగ్గా లేకపోవడం.. దానికితోడు వారిలో మంత్రులు కూడా ఉండటంతో.. కెసిఆర్ ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకున్నారు.

అందుకే కెసిఆర్, 'వీలైనంత త్వరగా పద్ధతి మార్చుకొని ఎన్నికలలోపు ప్రజల్లో మంచి పేరు తెచ్చుకోండి.. లేదంటే మీ స్థానాల్లో వేరేవాళ్లు పోటీకి దిగుతారు' అంటూ ఎమ్మెల్యేలకు వార్నింగ్ ఇచ్చారంట.. అయితే ఈ నివేదికలో కెసిఆర్ ఆనందపడే విషయం కూడా ఒకటుంది.. అదేంటంటే.. తెరాస పార్టీ పట్ల, ప్రభుత్వం పట్ల ప్రజలు సానుకూలంగా ఉన్నారంట.. అందుకే కెసిఆర్, అవసరమైతే పనితీరు సరిగ్గాలేని ఎమ్మెల్యేల స్థానాల్లో వేరే వాళ్ళని పోటీకి దించాలని చూస్తున్నట్టు తెలుస్తుంది.. చూద్దాం ఆ ఎమ్మెల్యేలు పద్ధతి మార్చుకుంటారో లేక పదవులు పోగొట్టుకుంటారో.