కాళ్ళు మొక్కిన కేసీఆర్!!

 

తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ నాయకుడు కేసీఆర్ కాళ్ళు మొక్కారు. కేసీఆర్ ఏంటి.. కాళ్ళు మొక్కడమేంటి? నమ్మబుద్ధి కావడం లేదు కదూ.. అవును నిజంగానే ఆయన మరొకరి కాళ్ళు మొక్కారు. అది కూడా ఏక్కడో కాదు.. వేలాది మంది జనం ముందు కేసీఆర్ ఒక వ్యక్తి కాళ్ళు మొక్కారు. ఆ వ్యక్తి ఎవరో కాదు.. కేసీఆర్‌కి చిన్నప్పుడు తెలుగు పాఠాలు చెప్పిన పంతులుగారు. ఆ సందర్భం ఎలా వచ్చిందంటే, మంగళవారం నాడు హైదరాబాద్‌లో ప్రముఖ సాహితీవేత్త దాశరథి 89వ జయంతి కార్యక్రమం రవీంద్రభారతిలో జరిగింది. ఈ కార్యక్రమంలో కేసీఆర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కేసీఆర్ ఈ సందర్భంగా సభా వేదిక మీదకి వెళ్తూ వుండగా, అక్కడ ముందు వరసలో కూర్చుని వున్న ప్రముఖ సాహితీవేత్త తిరుమల శ్రీనివాసాచార్య కేసీఆర్‌కి కనిపించారు. వెంటనే కేసీఆర్ ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా ఆయన కాళ్ళకి నమస్కారం చేశారు. తాను దుబ్బాక పాఠశాలలో చదువుకున్న సమయంలో తిరుమల శ్రీనివాసాచార్య తనకు తెలుగు పాఠాలు చెప్పేవారని కేసీఆర్ ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు. కేసీఆర్ తన పాదాలకు నమస్కరించి గురు భక్తిని చాటుకోవడం చూసి తిరుమల శ్రీనివాసాచార్య సంతోషంతో పొంగిపోయారు.