TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

ప్రధానిపై విమర్శల వర్షం.. ప్రశ్నల శర పరంపర..స్వరం పెంచిన కేసీఆర్

Published on: Sat Jul 2, 2022 8:52PM

ప్రధాని నరేంద్రమోడీ తెలంగాణ గడ్డపై బస చేసి ఉన్న వేళ ముఖ్యమంత్రి కేసీఆర్ తన స్వరం పెంచారు. మోడీ లక్ష్యంగా విమర్శల దాడికి పదును పెట్టారు. ఒక వైపు హైదరాబాద్ వేదికగా బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు జరుగుతున్న వేళ కేసీఆర్ వ్యూహాత్మకంగా రాష్ట్రపతి ఎన్నికకు విపక్షాల ఉమ్మడి అభ్యర్థి యశ్వంత్ సిన్హాను హైదరాబాద్ ఆహ్వానించి నగరంలో భారీ ర్యాలీ నిర్వహించారు. జల విహార్ లో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎంఐఎం ఎమ్మెల్యేలు, ఎంపీలతో సమావేశం ఏర్పాటు చేశారు.  ఆ మావేశం వేదికగా ప్రధాని నరేంద్ర మోడీ బహిరంగ సభలో ప్రసంగించడానికి ఒక రోజు ముందే కేసీఆర్ తనదైన శైలిలో మోడీ టార్గెట్ గా విమర్శనాస్త్రాలు సంధించారు.

ఒక రకంగా మోడీకి  ఆయన ఆదివారం (రేపటి) ప్రసంగం ఎజెండా ఏమిటన్నది కేసీఆర్ ఇచ్చేశారు. తన విమర్శలకు సమాధానం చెప్పాల్సిన పరిస్థితిని మోడీకి కల్పించారని చెప్పవచ్చు. దేశ రాజకీయాలను మార్చాల్సిన అవసరం ఉందన్న కేసీఆర్.. తన ప్రసంగం మొత్తం యశ్వంత్ కు మద్దతు ప్రకటనకు కాకుండా మోడీపై విమర్శల పరంపరకే ఉపయోగించుకున్నారు. తెలంగాణ గడ్డపై రెండు రోజులు బస చేయనున్న మోడీ ముందుగా తెలంగాణకు చేసిందేమిటో చెప్పాలని సవాల్ విసిరారు. అలాగే తమ ప్రశ్నలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.ఎనిమిదేళ్లుగా కేంద్రంలో అదికారంలో ఉన్నమోడీ సర్కార్ ఇచ్చిన వాగ్దానాలలో ఒక్కటైనా అమలు చేసిందా చెప్పాలన్నారు. చెసినట్లైతే అవేమిటో వివరించాలన్నారు. ఈ ప్రశ్న తన ఒక్కడిదే కాదని యావత్ ప్రజానీకానిదనీ అన్నారు.

రైతులు అడుగుతున్నది మద్దతు ధర మాత్రమేననీ, బంగారం కాదనీ అన్న కేసీఆర్.. రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామన్న మోడీ, అది చేయకపోగా వారి వ్యయాన్ని రెట్టింపు చేశారని అన్నారు. అన్యాయమైన రైతు చట్టాలు తీసుకువచ్చి రైతుల బతుకులను ఆగంఆగం చేశారని దుమ్మెత్తి పోశారు. చివరికి రైతుల ఆందోళనలకు దిగి వచ్చి వారికి బహిరంగ క్షమాపణ చెప్పి ఆ చట్టాలను ఉపసంహరించుకున్నారని కేసీఆర్ పేర్కొన్నారు. ఆ రైతు ఉద్యమంలో అసువులు బాసిన రైతులకు మేం సాయం చేస్తే అవహేళన చేస్తున్నారన్నారు. కేంద్రం చేయాల్సిన పనిని మేం చేశామని, మరణించిన రైతు కుటుంబాలను ఆదుకోన్నందుకు తాము గర్వ పడుతున్నామని, ఆ పని చేయలేకపోయినందుకు మోడీ సిగ్గుపడాలని కేసీఆర్ ఆన్నారు.

మోడీ పాలనలో రైతులు, ఉద్యోగులు, విద్యార్థులు, మధ్యతరగతి ప్రజలు, అల్పాదాయ వర్గాల ప్రజలు ఇలా ఏ వర్గమూ సంతోషంగా లేదని కేసీఆర్ అన్నారు. ప్రభుత్వ వ్యవస్థను మోడీ దుర్వినియోగం చేశారని దుమ్మెత్తి పోశారు. మోడీ పాలనలో దేశ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలే స్థితికి చేరుకుందన్నారు.

పెద్ద కంపెనీలన్నీ దేశం వదిలి వెళ్లిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. మోడీ అస్తవ్యస్థ పాలనను చూస్తూ టీఆర్ఎస్ మౌనంగా ఉండజాలదన్నారు. అలాగే ఆదివారం పరేడ్ గ్రౌండ్స్ బహిరంగ సభలో మోడీ ఏం మాట్లాడబోతున్నారో కేసీఆర్ చెప్పేశారు. మోడీ హైదరాబాద్ గడ్డ మీద నుంచి తెలంగాణ ప్రజలను ఉద్దేశించి చేసే ప్రసంగంలో తనను విమర్శించడం వినా మరో మాట ఉండదన్నారు. వ్యక్తిగతంగా మోడీతో తనకు విభేదాలు లేవన్న కేసీఆర్ మోడీ నిజాయితీగా తన ప్రశ్నలకు సమాధానం చెప్పి తెలంగాణ గడ్డ వీడాలని కేసీఆర్ డిమాండ్ చేశారు.