Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...కాశ్మీర్ లో చేశారు.. ఇక్కడెందుకు చేయరు!.. నియోజకవర్గాల పునర్విభజనపై కేసీఆర్ గళం
posted on: May 11, 2022 10:31AM
కేంద్రాన్ని ఇరుకున పెట్టేందుకు కేసీఆర్ మరో వ్యూహాన్ని తెరపైకి తీసుకువచ్చారు. తెలంగాణలో నియోజకవర్గాలను పెంచాలని గళమెత్తాలని ఆయన నిర్ణయించుకున్నారు. రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టంలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అసెంబ్లీ నియోజకవర్గాలను పెంచాలని ఉంది. దీని కోసం గతంలో కేసీఆర్ ప్రయత్నాలు చేసినా ఫలించకపోవడంతో మిన్నకున్నారు.
అయితే ఇప్పుడు కేంద్రంలోని మోడీ సర్కార్ ను ఇరుకున పెట్టడమే లక్ష్యంగా ఆ ఆంశాన్ని తెరపైకి తీసుకురావాలని భావిస్తున్నారు. ఇందు కోసం కేంద్రంపై లేఖాస్త్రాలు సంధించాలని యోచిస్తున్నారు. ఇప్పుడింత హఠాత్తుగా నియోజకవర్గాల పెంపు విషయం కేసీఆర్ఎందుకు లేవనెత్తుతున్నారు. కేంద్రం, తెలంగాణ రాష్ట్రాల మధ్య సంబంధాలు ఉప్పు, నిప్పుగా ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో తెలంగాణ డిమాండ్ ను కేంద్రం ఎట్టి పరిస్థితుల్లోనూ ఆమోదించదని తెలిసినా కేసీఆర్ నియోజకవర్గాల పెంపుపై పట్టుబడుతున్నారు.
ఎందుకంటే ఇటీవలే కాశ్మీర్ ను రెండు రాష్ట్రాలుగా చేసి నియోజకవర్గాల డీ లిమిటేషన్ కూడా పూర్తి చేసేసింది. దానికి ఆమోద ముద్ర వేసి ఎన్నికలు జరిపించడమే తరువాయి. అక్కడ ఆఘమేఘాల మీద చేసేశారు, తెలుగు రాష్ట్రాలవిభజన జరిగి ఎనిమిదేళ్లయినా, విభజన చట్టంలో నియోజకవర్గాల పెంపు అంశం స్పష్టంగా ఉన్నా ఎందుకు పట్టించుకోవడం లేదని చేయరని ప్రశ్నిస్తూ కేంద్రంపై లేఖాస్త్రాలను ప్రయోగించడం ద్వారా మోడీ సర్కార్ ను ఇరుకున పెట్టాలన్నదే కేసీఆర్ లక్ష్యంగా పరిశీలకులు అభివర్ణిస్తున్నారు.
కేసీఆర్ డిమాండ్ పై కేంద్రం స్పందించినా, స్పందించకున్నా.. నియోజకవర్గాల పెంపు అంశాన్ని ప్రస్తావిండం ద్వారా తనకు రాజకీయంగా ప్రయోజనం చేకూరుతుందన్నదే కేసీఆర్ ఉద్దేశంగా పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. తెలుగు రాష్ట్రాలలో నియోజకవర్గాల పెంపు అంశంపై గతంలో కూడా రెండు రాష్ట్రాలూ డిమాండ్ చేశాయి. ఏపీ మాజీ సీఎం నారా చంద్రబాబునాయుడు నియోజకవర్గాల పెంపు కోసం అప్పటికి మిత్రపక్షమైన బీజేపీతో పెద్ద యుద్ధమే చేశారు. ఆ సమయంలోనే సీఎం కేసీఆర్ కూడా నియోజకవర్గాల పెంపు జరగాల్సిందేనని పట్టుబట్టారు.
అయితే ఉభయ తెలుగు రాష్ట్రాలలో నియోజకవర్గాలను పెంచాలంటే.. రాజ్యాంగ సవరణ చేయాల్సి ఉంటుందని అప్పట్లో కేంద్రం తేల్చి చెప్పింది. దీంతో తెలుగు రాష్ట్రాలలో అసెంబ్లీ నియోజకవర్గాల పెంపు అంశం మెల్లిమెల్లిగా మరుగున పడింది. ఇప్పుడు కాశ్మీర్ లో నియోజకవర్గాల డీ లిమిటేషన్ తో ఈ అంశాన్ని తెరపైకి తెచ్చి కేంద్రంలోని మోడీ సర్కార్ ను ఇరుకున పెట్టాలన్న ఉద్దేశంతో కేసీఆర్ పావులు కదుపుతున్నట్లు పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.






