TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

కేసీఆర్ గుప్పిట్లో ఆ ఇద్దరి రహస్యాలు?

Published on: Tue Apr 5, 2022 1:10PM

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కేంద్రం ఫై యుద్ధం ప్రకటించారు. కేంద్రం ఫై యుద్ధం ప్రకటించడమే కాదు, ప్రధాని నరేంద్ర మోడీని, కేంద్ర మంత్రులను పేరు పెట్టి మరీ, ఆయన భాషలో దూషిస్తున్నారు. దుర్భాష లాడుతున్నారు. ఇక రాష్ట్ర బీజేపీ నాయకుల విషయం అయితే చెప్పనే అక్కర లేదు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఇతర నాయకులపై  ముఖ్యమంత్రి, మంత్రులు ఒంటికాలు మీద లేస్తున్నారు. ముఖ్యమంత్రి ఒక సారిగా ఎందుకు కేంద్రంపై కాలు దువ్వుతున్నారు?  ఏ ధైర్యంతో ఆయన, ఇంతలా దూకుడు చూపుతున్నారు? అనేది, అంతరంగికులకు కూడా అంటూ చిక్కని ప్రశ్నగానే వుంది.  

మరోవంక ఓ వంక ముఖ్యమంత్రి ఫ్యామిలీ మొత్తంగా అవినీతి ఊబిలో కూరుకు పోయిందని,  ఆయన ఫ్యామిలీ కరప్షన్’పై కేంద్ర ప్రభుత్వం కన్నేసిందని, రేపో మాపో ఆయన జైలుకు పోవడం ఖాయమని వార్తలు వస్తున్న నేపధ్యంలో ముఖ్యమంత్రి ఇంత ధైర్యంగా కేంద్రంఫై  ఇలా ఎలా కత్తులు దూస్తున్నారు? ఏమిటీ  ధైర్యం? ఎక్కడిదీ తెగింపు? అనే ప్రశ్నలకు రాజకీయ విశ్లేషకులు కొత్త కొత్త థియరీలను వెతికి పట్టుకుంటున్నారు. నిజానిజాలు ఎలా ఉన్నప్పటికీ  తీగలాగితే డొంకంతా కదిలింది అన్న విధంగా, కేసీఆర్ ధైర్యానికి ఒకటి కాదు, రెండు కారణాలు కనిపిస్తున్నాయి అంటున్నారు.. 

ఒకప్పుడు, హైదరాబాద్ సమీపంలో  గుజరాత్ ఏటీఎస్ పోలీసులకు చిక్కి, గుజరాత్’లో ఎన్కౌంటర్ అయినా, సోహ్రబుద్దిన్ షేక్ ఎన్కౌంటర్’ దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఇప్పుడు మళ్ళీ, సోహ్రబుద్దిన్’ ఎన్కౌంటర్ విషయం తెలంగాణ రాజకీయాల్లో, సంచలనంగా మారే సంకేతాలు కనిపిస్తున్నాయనే మాట వినిపిస్తోంది.  అయితే, అసలు ఈ సోహ్రబుద్దిన్ షేక్  ఎవరంటే అది మళ్ళీ మరో పెద్ద కథ. క్లుప్తంగా చెప్పుకోవాలంటే, సోహ్రబుద్దిన్ షేక్’ ఎన్కౌంటర్’లో  చనిపోయిన ఒక నేరస్తుడు. సోహ్రబుద్దిన్ ఎన్కౌంటర్’ సమయానికి గుజరాత్, రాజస్థాన్, మధ్య ప్రదేశ్ మరికొన్ని రాష్ట్రాలలో నేరాలకు పాల్పడిన ఆరోపణలు,కేసులు ఉన్నాయి. ఉగ్రవాదులకు ఆయుధాలు సరఫరా చేసిన కేసులు కూడా ఆయనపై ఉన్నాయి. అతగాడో ఉగ్రవాద క్రిమినల్. 

అంతే అయితే, అందులో విశేషం ఉండక పోవచ్చును.అయితే 2005 నవంబర్’లో జరిగిన  ఈ ఎన్కౌంటర్’కి ప్రస్తుత కేంద్ర హోమ్ మంత్రి, అప్పటి గుజరాత్ హోమ్ అమిత్ షాకు సంబంధముందన్న ఆరోపణలున్నాయి. ఇంకొంచెం లోతుల్లోకి వెళితే ప్రధాని నరేంద్ర మోడీ పేరు కూడా ఈ కేసులో అప్పట్లో గట్టిగానే వినిపించింది. అయితే, ఆ ఆరోపణలను కోర్టులు కొట్టివేశాయి. అయినా, అనుమానాలు అలాగే ఉన్నాయి. అదొకటైతే,సోహ్రబుద్దిన్ ఆయన భార్య కౌసర్ బీ’  హైదరబాద్ నుంచి మహారాష్ట్రలోని సంగ్లీకి వెళుతుండగా హైదరాబాద్ సమీపంలో గుజరాత్ ఏటీఎస్ పోలీసులు వారిని పట్టుకున్నారు. గుజరాత్ తీసుకెళ్ళారు. ఆ తర్వాత రెండుమూడు రోజులకు, సోహ్రబుద్దిన్ షేక్ ఎన్కౌంటర్ అయ్యారు. ఆ తర్వాత ఆయన భార్య కూడా అనుమానస్పద పరిస్థితుల్లో సగం కాలిన శవమై కనిపించింది. నిజానికి, సోహ్రబుద్దిన్ ఎన్కౌంటర్ కథ, అక్కడితో ముగిసి పోలేదు. ఇంకా చాలా మలుపులు తిరిగింది. 

కట్ చేస్తే ... 2017లో హైదరాబాద్’ శివార్లలో  గ్యాంగస్టర్‌ నయీం ఎన్కౌంటర్ జరిగింది. ఆ సమయంలో తెలంగాణ పోలీసులు, సిట్ నిర్వహించిన విచారణలో అసలు విషయం ఎలా ఉన్నా, నయీం డైరీలలో సోహ్రబుద్దిన్ ఎన్కౌంటర్’కు సంబందించిన అనేక విషయాలు, ముఖ్యంగా ఈ ఎన్కౌంటర్’తో మోడీ, షా పాత్రకు సంబందించి, కొన్ని ఆధారలు దొరికినట్లు సమాచారం. ఇప్పుడు ఆ ఆధారాలు ముఖ్యమంత్రి కేసీఆర్ వద్ద ఉన్నాయని, అధైర్యంతోనే ఆయన, కేంద్రం పై యుద్ధం ప్రకటించడమే కాకుండా, సవాళ్ళు చేస్తున్నారని అంటున్నారు. నిజానికి, ఢిల్లీ పై యుద్ధం, వరి వివాదం వట్టిట్టి ముచ్చట్లే అని, సోహ్రబుద్దిన్ ఎన్కౌంటర్ రహస్యాలను అస్త్రంగా అయితే వియ్యం కాదంటే కయ్యం అన్న రీతిలోనే, కేసీఆర్ ఢిల్లీతో బేరసారాలు సాగిస్తున్నట్లు అంతర్గత సమాచారం. ఇందుకు సంబందించే ఆయన బీజేపీ ఎంపీ సుబ్రమణ్య స్వామికి ఉప్పందిచడమే కాకుండా, ఆయనతో పాటు కొందరు మోడీ, షా వ్యతిరేక బీజేపీ నాయకులు, తలలు పండిన న్యాయవాదులతో చర్చలు జరుపుతున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఆ పని మీదనే ముఖ్యమంత్రి తరచూ ఎదో ఒక సాకున ఢిల్లీ వెళ్లి తిష్ట వేస్తున్నారని అంటున్నారు.

అదొకటి అలా ఉంటే పరిస్థితి విషమించి, జరగరానిది జరిగితే, పలాయనం చిత్తగించేదుకు కూడా ముఖ్యమంత్రి మరో ప్రత్యన్మాయాన్ని సిద్దం చేసుకున్నారని అంటున్నారు. అందుకోసమే ఇంగ్లాండ్’లో ప్రగతి భవన్ను తలదన్నే రాజ ప్రసాదాల వంటి  విలాసవంత భవనాల అన్వేషణలో ఉన్నట్లు రాజకీయ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. నిజానికి ముఖ్యమంత్రికి అత్యంత సన్నిహితంగా ఉండే రాజ్య సభ సభ్యుడు ఒకరు, ప్రస్తుతం యూకేలో అదే పని మీద ఉన్నట్లు సమాచారం. అయితే, అలాంటి పరిస్థితి వస్తుందా? అంటే ఏమో ..దేశంలో జరుగుతున్న పరిణామాలను చూస్తే, ఏదైనా జరగవచ్చని అంటున్నారు. అదెలా ఉన్నప్పటికీ, మోడీ, షా గుట్టు కేసీఆర్ గుప్పిట్లో ఉంటే, కేసీఅర్ గుట్టు ఆ ఇద్దరి గుప్పిట్లో ఉన్నాయి, అంతవరకు అయితే నిజమే అనిపిస్తోంది. ఇక ఈ ఆటలో అంతిమ విజేతలు ఎవరవుతారో, చివరకు ఆట ఎలా ముగుస్తుందో.. వేచి చూడవలసి ఉందని పరిశీలకులు అంటున్నారు.