TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

గజ్వేల్ కు కేసీఆర్ గుడ్ బై

Published on: Tue Jun 7, 2022 1:45PM

రెండుసార్లు ఘన విజయం కట్టబెట్టిన గజ్వేల్ అసెంబ్లీ నియోజకవర్గానికి వచ్చే ఎన్నికల్లో సీఎం కేసీఆర్ టాటా.. బైబై చెప్పేస్తున్నారట. ఈ విషయం టీఆర్ఎస్ వర్గాలే  చెబుతున్నాయి.  మెదక్ లోక్ సభ స్థానం నుంచి  లేదా.. మరో అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేయాలనే యోచనలో కేసీఆర్ ఉన్నారంటున్నారు. వచ్చే ఏడాది తెలంగాణ శాసనసభకి ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే.
2014లో జరిగిన ఎన్నికల్లో కేసీఆర్ కు 86 వేల 694 ఓట్లు వేసి, సమీప టీడీపీ ప్రత్యర్థి వంటేరు ప్రతాపరెడ్డి కన్నా 19 వేల 391 ఓట్లు ఆధిక్యం కట్టబెట్టారు గజ్వేల్ నియోజకవర్గం ఓటర్లు. మరి 2018లో జరిగిన ఎన్నికల్లో కేసీఆర్ కు లక్షా 25 వేల 444 ఓట్లు వేయడంతో పాటు కాంగ్రెస్ తరఫున కేసీఆర్ కు సవాల్ చేసిన అదే ప్రత్యర్థి వంటేరు ప్రతాపరెడ్డి కన్నా 58 వేల 290 ఓట్ల మెజార్టి ఇచ్చారు జనం. మరి తనను ఇంతలా జనం ఆదరిస్తున్న గజ్వేల్ నియోజకవర్గం ప్రజలకు కేసీఆర్ ఎందుకు దూరం అవ్వాలనుకుంటున్నారనే దానిపై రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చే నడుస్తోంది.
తెలంగాణ ఏర్పాటైనప్పటి నుంచి వరుసగా రెండుసార్లు అధికారం చేపట్టిన టీఆర్ఎస్ పార్టీపై ఓటర్లలో సహజంగానే వ్యతిరేకత వ్యక్తం అవుతోందని, కేసీఆర్ స్వయంగా చేయించుకున్న సర్వేలు కూడా   చెబుతుండడంతో ఆయన వ్యూహం మారుస్తున్నారంటున్నారు. గత ఎన్నికల కన్నా ఈ సారి టీఆర్ఎస్ కు సీట్లు, ఓట్ల శాతం కూడా బాగా తగ్గిపోయే అవకాశాలు ఉన్నాయంటున్నారు. అలాగే  గజ్వేల్ ఓటర్లు కూడా కేసీఆర్ ను నెత్తిన పెట్టుకునేందుకు సిద్ధంగా లేరనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. సీఎం కేసీఆరే తమ నియోజకవర్గం ఎమ్మెల్యే అయినప్పుడు తామంతా అభివృద్ధిలో దూసుకుపోతామని ఓటర్లు సహజంగా ఆశించారు. అయితే.. కేసీఆర్ ఎంతసేపూ తన ఫాంహౌస్ అభివృద్ధిపైనే కాని నియోజకవర్గం అభివృద్ధిపై ఏమాత్రం శ్రద్ధ పెట్టలేదనే విమర్శలు స్థానికుల నుంచి వస్తున్నాయి.

మరో పక్కన టీడీపీ, కాంగ్రెస్ పార్టీ తరఫున బరిలో దిగి గతంలో ఓడిపోయిన వంటేరు ప్రతాపరెడ్డి నియోజకవర్గంలో బలమైన రాజకీయ నాయకుడు. గతంలో కేసీఆర్ పై విమర్శలతో విరుచుకుపడ్డారు. కేసీఆర్ పై వంటేరు చేయని ఆరోపణ లేదు. 2018 ఎన్నికల తర్వాత వంటేరు ప్రతాపరెడ్డిని టీఆర్ఎస్ లో చేర్చుకున్నారు కేసీఆర్. అప్పుడే వచ్చే ఎన్నికల్లో గజ్వేల్ టికెట్ వంటేరుకు ఇస్తానని కేసీఆర్ మాట ఇచ్చారని అంటారు. అందు కోసం కూడా ఈ సారి గజ్వేల్ పోటీ నుంచి కేసీఆర్ తప్పుకుంటున్నారంటున్నారు. ఈ సారి గజ్వేల్ నుంచి పోటీ చేయబోనని, వంటేరు ప్రతాప్రెడ్డి రెడీగా ఉండాలని కేసీఆర్ చెప్పినట్లు ఆయన వర్గీయులు చెబుతుండడం గమనార్హం.

గజ్వేల్ నుంచి కాకుండా ఈ సారి కేసీఆర్ నల్గొండ జిల్లాలోని మునుగోడు అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేస్తారనే ప్రచారం కొంతకాలంగా జరిగింది.  అయితే.. అది కూడా కాదని కేసీఆర్ ఈ సారి మెదక్ నుంచి లోక్ సభ  స్థానం నుంచి బరిలో దిగుతారనే అభిప్రాయం టీఆర్ఎస్ వర్గాల నుంచి బలంగా వినిపిస్తోంది. జాతీయ రాజకీయాల్లో కీలకంగా వ్యవహరించాలని కేసీఆర్ ఉవ్విళ్లూరుతున్నారు.  అందుకు ప్రజలు తనను ఆశీర్వదించాలని పదే పదే విజ్ఞప్తి చేస్తున్నారు కేసీఆర్. కేంద్రంలో బీజేపీ, కాంగ్రెస్సేతర కూటమిని కూడగట్టేందుకు కాలికి బలపం కట్టుకుని తిరుగుతున్నారు. అసెంబ్లీకి పోటీ చేస్తే.. జాతీయ రాజకీయాల్లో చురుగ్గా చక్రం తిప్పాలనే తన లక్ష్యం కష్టం అవుతుందనేది కేసీఆర్ అభిప్రాయంగా ఉందంటున్నారు.  అందుకే ఈ సారి కూడా మెదక్ లోక్ సభా స్థానం నుంచి పోటీ చేయాలని ఆయన భావిస్తున్నారంటున్నారు. ఎందుకంటే తెలంగాణ ఏర్పాటయ్యాక తొలిసారిగా 2014లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో గజ్వేల్ అసెంబ్లీ స్థానంతో పాటు మెదక్ లోక్ సభా నియోజకవర్గంలో కూడా కేసీఆర్ పోటీ చేసి విజయాలు సాధించారు. అయితే.. కొత్త రాష్ట్రం తొలి సీఎంగా పదవీ బాధ్యతలు చేపట్టిన కేసీఆర్ మెదక్ ఎంపీగా రాజీనామా చేశారు.

ఇప్పుడు కేసీఆర్ అటు గజ్వేల్ నుంచి, ఇటు మెదక్ లోక్ సభా స్థానం నుంచి పోటీ చేయకపోయినా తెలంగాణలోని మరే ఇతర నియోజకవర్గం నుంచి అసెంబ్లీకి వెళ్తే.. గజ్వేల్ లో వంటేరుకు లైన్ క్లియర్ అయినట్లే అంటున్నారు. మెదక్ లో కేసీఆర్ పోటీ చేయకపోతే.. మరొకరిని ఛాన్స్ వస్తుంది. అలాంటి అవకాశమే వస్తే.. మెదక్ సీటు కోసం పలువురు నేతలు క్యూలో ఉన్నారంటున్నారు. ఈ క్రమంలో టీఆర్ఎస్ నేతలు రెండు గ్రూపులుగా విడిపోయి పనిచేయడం, వాటికి ఆయా నాయకులే నాయకత్వం వహిస్తుండడం విశేషం.

ఒక పక్కన తమ ప్రభుత్వంపై జనం నుంచి వ్యక్తం అవుతున్న వ్యతిరేకత, మరో పక్కన పార్టీలో గ్రూపు రాజకీయాల కారణంగా కేసీఆర్ లో ఆందోళన మొదలైందని అంటున్నారు. దీంతో వచ్చే ఏడాది జరిగే అసెంబ్లీ ఎన్నికల కోసం కేసీఆర్ ఎలాంటి వ్యూహం రచిస్తారో అని రాజకీయ వర్గాల్లోనూ, రాజకీయ విశ్లేషకుల్లోను, తెలంగాణ ప్రజల్లోనూ ఆసక్తి నెలకొంది.