TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

అవినీతి బురద కొద్దిగా వున్నప్పుడే… కడుక్కోవటం మంచిది!

Published on: Thu Jun 1, 2017 12:46PM

కేంద్రంలో యూపీఏ పాలన పదేళ్లు, సమైక్య రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కార్ పదేళ్లు కొనసాగాయి. తరువాత 2014లో ఏపీ, తెలంగాణ,  దిల్లీల్లో ప్రభుత్వాలు మారాయి. అయితే, మోదీ, చంద్రబాబు, కేసీఆర్ ఇంత వరకూ గర్వంగా చెప్పుకోగలిగింది అవినీతి రహిత పాలనే! ఆంధ్రాలో వైసీపీ బాబుగారి అవినీతి అంటూ గోల చేసినా ఇప్పటి వరకూ బలమైన ఆధారాలతో ఏ కేసులోనూ కార్నర్ చేయలేకపోయింది. ఇక మోదీ, కేసీఆర్ అయితే ప్రతిపక్షాలకి అవినీతి విషయంలో కొంచెం కూడా అవకాశం ఇవ్వలేదు. వేరే వివాదాలు ఎన్ని తలెత్తినా అవినీతి, కుంభకోణాలు మాత్రం అటు ఎన్డీఏ ప్రభుత్వాన్ని, ఇటు గులాబీ సర్కార్ ని ఇబ్బంది పెట్టలేదు. కాని, తాజాగా బయటపడ్డ మియాపూర్ భూముల అక్రమ రిజిస్ట్రేషన్ కుంభకోణం… టీఆర్ఎస్ ప్రభుత్వానికి మచ్చతెచ్చేలా కనిపిస్తోంది…

 

ఎనీవేర్ రిజిస్ట్రేషన్ పద్ధతిని ఆసరా చేసుకుని సబ్ రిజిస్ట్రార్ స్థాయి అధికారులు చేతి వాటం చూపిన సంగతి కొన్ని రోజులుగా హాట్ టాపిక్ అవుతోంది. కోట్లు ఖరీదు చేసే నగరంలోని భూములు ఆక్రమార్కుల చేతికి చిక్కాయి. ఇప్పుడు కేసీఆర్ గట్టి చర్యలు తీసుకుని జరిగిన డ్యామేజ్ కంట్రోల్ చేయటానికి ప్రయత్నిస్తున్నప్పటికీ మీడియాలో వస్తున్న కథనాలు ఆయన సర్కార్ ప్రతిష్ఠ దిగజార్చేలా వున్నాయి. తక్షణమే దిద్దుబాటు చర్యలు తీసుకోకుంటే తొలి తెలంగాణ ప్రభుత్వంపై వున్న పారదర్శకమైన అభిప్రాయం బలహీనపడే అవకాశం వుంది.

 

మియాపూర్ లో కోట్లాది రూపాయల విలువ చేసే భూములు గోల్ మాల్ చేశారు అధికారులు. అయితే, ఇప్పుడు సరికొత్తగా వినిపిస్తున్న టాక్ ప్రకారం కేసీఆర్ క్యాబినేట్లోని ఒక సీనియర్ మంత్రి ఈ కుంభకోణానికి సహకరించారట! ఆయన పేరు, ఆయన శాఖ గురించి మీడియా చెప్పకున్నా…. చాలా బలమైన ఆధారాలే లభించాయట ఆయన ఇన్వాల్వ్ మెంట్ గురించి. అసలు మియాపూర్ భూముల గోల్ మాల్ లో తొలి లబ్ధిదారుడు ఆయనే అంటోంది మీడియా. 50కోట్లు విలువ చేసే భూమి మంత్రి ఫ్రీగా కాజేశారట.

 

కేసీఆర్ క్యాబినేట్లో ఒక సీనియర్ మంత్రి స్వయంగా ప్రొత్సహించి మియాపూర్ భూముల అక్రమాలు నడిపించారనేది మామూలు ఆరోపణ కాదు. అందులో నిజం వున్నా లేకున్నా సీఎం వెంటనే ఆ మంత్రి ఎవరో నిర్ధారించుకుని చర్యలు తీసుకుంటే బావుంటుంది. అసలు అవినీతి జరగకపోతే చాలా బావుండేది. కాని, తప్పు జరిగిందని ఆల్రెడీ అర్థమవుతోంది. ఇక అందులో మంత్రి హస్తం వుందని వార్తలు రావటం జనంలోకి తప్పుడు సంకేతాలు పంపుతాయి. అందుకే, కేసీఆర్ సదరు మంత్రి ఎవరో తెలుసుకుని వేటు వేస్తే నైతికంగా వుంటుంది. ఆయన తప్పేం లేదని భవిష్యత్ లో తేలితే తిరిగి పదవి ఇవ్వవచ్చు. గతంలో సీఎం మంత్రి రాజయ్యను కఠిన వైఖరి అవలంబి తొలగించారు. ఇప్పుడూ అలాగే చేస్తే ఆయనపై జనంలో నమ్మకం పెరుగుతుంది! లేదంటే, ప్రభుత్వ ప్రతిష్ఠ మసకబారే అవకాశం లేకపోలేదు. ఈ మధ్యే జింకల వేట విషయంలో కూడా ఓ మంత్రి పేరు పదే పదే పరోక్షంగా వినిపిస్తూ వచ్చింది…