TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

కవిత బీఆర్ఎస్.. వైసీపీలో గుబులు, తెలుగుదేశం కూటమిలో జోష్!.. ఎందుకంటే?

Published on: Sat May 2, 2026 10:57AM

తెలంగాణ రాజకీయాల్లో   భారత రాష్ట్ర సమితి  అధినేత కేసీఆర్ కుమార్తె, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఏప్రిల్ గత నెల 25న టీఆర్ఎస్ పేరుతో కొత్త రాజకీయ పార్టీని ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఆమె తన కొత్త పార్టీ ద్వారా తెలంగాణ రాజకీయాలలోనే కాదు, ఏపీ రాజకీయాలలో కూడా పెను సంచలనం సృష్టించారు. కొత్త పార్టీ ప్రకటన సందర్భంగా కల్వకుంట్ల కవిత.. తన తండ్రి, బీఆర్ఎస్ అధినేతపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. తన తండ్రిని మరమనిషి అన్నారు, గుంటనక్కల చేతిలో బందీ అని విమర్శించారు. ఈ పరిణామం సహజంగానే తెలంగాణ రాజకీయాలలో సంచలనం సృష్టించింది. బీఆర్ఎస్ లో పెను ప్రకంపనలకు కారణమైంది. 

అయితే ఆమె కొత్త రాజకీయ పార్టీ ప్రకటన.. ఏపీ రాజకీయాలలో కూడా సంచలనం సృష్టించింది. ఆమె పార్టీ ప్రకటన వైసీపీకి ఒకింత ఇబ్బందికరంగా మారగా, తెలుగుదేశం, జనసేన పార్టీల్లో జోష్ ను నింపింది.   టీడీపీ-జనసేన కూటమికి కవిత కొత్త పార్టీ   ఒక గొప్ప వ్యూహాత్మక అవకాశాన్ని అందించినట్లయిందని విశ్లేషకులు భావిస్తున్నారు.

గత కొన్నేళ్లుగా కేసీఆర్ నాయకత్వంలోని బీఆర్ఎస్, ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలోని వైసీపీ మధ్య ఒక అవగాహన ఉందని రాజకీయ వర్గాల్లో ప్రచారం ఉన్న సంగతి తెలిసిందే. గత ఎన్నికల సమయంలో వారిరువురూ ఒకరికొకరు అందించుకున్న సహకారం సంగతి తెలిసిందే.  ఆ సహకారం, స్నేహం ఇప్పుడు.. అంటే రెండు పార్టీలూ కూడా వాటి వాటి రాష్ట్రాలలో అధికారం కోల్పోయిన తరువాత కూడా కొనసాగుతోందని పరిశీలకులు సోదాహరణంగా ఉదహరి స్తున్నారు. అటువంటిది.. ఇప్పుడు కవిత సొంతంగా టీఆర్ఎస్ పార్టీని స్థాపించడమే కాకుండా... ఆ సందర్భంగా తన తండ్రి కేసీఆర్, సోదరుడు కేటీఆర్ లపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. అక్కడితో ఊరుకోకుండా.. బీఆర్ఎస్ ను ఆత్మ లేని పార్టీగా అభివర్ణించారు.  ఈ పరిణామాలు బీఆర్ఎస్ ను డిఫెన్స్ లో పడేశాయి. కవితను విమర్శించ లేక, ఆమె విమర్శలను తిప్పి కొట్టలేక నాయకత్వం మౌనాన్ని ఆశ్రయిస్తే.. బీఆర్ఎస్ క్యాడర్ అయోమయంలో పడింది. ఈ పరిస్థితి వైసీపీ అధినేత జగన్ కు ఒక బలమైన మిత్రుడి అండ లేకుండా చేసిందంటున్నారు పరిశీలకులు.  

అదే సమయంలో..   టీడీపీ, జనసేన పార్టీలు.. కల్వకుంట్ల కుటుంబంలో తలెత్తిన విభేదాలను ఉదహరిస్తూ..  కుటుంబ రాజకీయాల వల్ల పార్టీలు ఎలా దెబ్బతింటాయో చెప్పడానికి కవిత ఉదంతాన్ని టీడీపీ-జనసేన శ్రేణులు ఉదహరిస్తున్నాయి. అదే తెలంగాణలో కవిత తిరుగుబాటును చూపిస్తూ, ఏపీలో కూడా వైసీపీ నాయకత్వం పట్ల అసంతృప్తిగా ఉన్న నేతలకు ఇదొక సంకేతమని   ప్రచారం చేస్తున్నారు. రాజకీయ అధికారం ఒకే కుటుంబం చుట్టూ తిరిగితే జరిగే నష్టాన్ని ప్రజలకు వివరించడానికి చంద్రబాబు మరియు పవన్ కళ్యాణ్ ఈ పరిణామాలను తమ ప్రసంగాల్లో వాడుకుంటున్నారు. జగన్ కూడాతన సొంత తల్లి, చెల్లిని దూరం పెట్టి అధికారం కోసం పాకులాడిన తీరును ఎత్తి చూపుతూ.. కవిత తన తండ్రికి అధికారంపై అపేక్ష మమకారాన్ని దూరం చేసిందని విమర్శించడాన్ని ప్రస్తావిస్తున్నారు. 

ఇక పోతే.. తెలంగాణ సెంటిమెంట్‌ను కాపాడటమే తన లక్ష్యమని కవిత చెబుతున్నప్పటికీ..  ఆమె అడుగులు బీఆర్ఎస్ ఓటు బ్యాంకును చీల్చడం ఖాయంగా కనిపిస్తోంది. ఇదే జరిగితే, గతంలో బీఆర్ఎస్ నుంచి వైసీపీకి  అందిన, ప్రస్తుతం అందుతున్న, నైతిక సహకారం ఇకపై అందే అవకాశం వైసీపీకి ఉండదు.  ఇది ఏపీలో కూటమి ప్రభుత్వం తన పట్టును మరింత బిగించుకోవడానికి సహాయపడుతుంది.    భవిష్యత్తులో కవిత పార్టీ వల్ల తెలంగాణలో రాజకీయ సమీకరణాలు ఎలా మారినా, ఏపీలో మాత్రం ఇది కూటమి ప్రభుత్వానికి సానుకూల పవనాలను ఇస్తోంది. పొరుగురాష్ట్రంలో మిత్రుడి  బలం తగ్గడం, అంతర్గత కలహాలతో బలహీనపడటం వంటివి వైసీపీకి రాబోయే కాలంలో  సవాళ్లను విసిరేలా ఉన్నాయి. హైదరాబాద్‌ నుంచి మొదలైన ఈ రాజకీయ తుపాను  ఏపీలో వైసీపీని బలహీనపరిచే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.