TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

కల్వకుంట్ల కవిత కొత్త రాజకీయ పార్టీ ముహూర్తం ఖరారు

Published on: Thu Feb 19, 2026 1:45PM

బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చిన కల్వకుంట్ల కవిత కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటుకు ముహూర్తం ఖరారైంది.  గత కొంతకాలంగా తెలంగాణ జాగృతి వేదికగా రాజకీయాలు చేస్తున్న కల్వకుంట్ల కవిత సొంతంగా ఓ కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటు చేస్తానని చెబుతూ వస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆమె తాను ఏర్పాటు చేయబోయే కొత్త పార్టీకి ముహూర్తం కూడా ఖఱారు చేశారు.  గురువారం హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌లోని తెలంగాణ జాగృతి కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఈ ఏడాది మే మొదటి వారంలో తాను కొత్త పార్టీని ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు.  

తాను ఏర్పాటు చేయనున్న కొత్త పార్టీ పేరులో తెలంగాణ పదం కచ్చితంగా ఉంటుందని కవిత చెప్పారు.  రానున్న అసెంబ్లీ ఎన్నికలలో తాను పోటీ చేస్తానని స్పష్టం చేసిన ఆమె.. ఆ పోటీ ఎక్కడ నుంచైనా ఉండొచ్చన్నారు. అయితే తన మొదటి చాయిస్ మాత్రం సిద్దిపేటేనని చెప్పారు. ఇక రెండో చాయిస్ బోధన్ అని చెప్పిన కవిత.. ప్రజల ఆకాంక్షలను ప్రతిబింబించేదిగా తన పార్టీ పేరు ఉంటుందన్నారు.  
ఇటీవల కాలంలో తెలంగాణ ప్రజల సమస్యలు తెలుసుకునేందుకు జనం బాట అనే కార్యక్రమం చేపట్టి రాష్ట్రవ్యాప్తంగా కవిత పర్యటిస్తున్నారు. ఈ పర్యటనలో ప్రజల సమస్యలు తెలుసుకుని వాటి పరిష్కరించాలని కాంగ్రెస్ సర్కార్‌కు డిమాండ్ చేస్తున్నారు. అలాగే ఈనెలలో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో కూడా ఆమె మద్దతుదారులను ఏఐబీఎఫ్ పార్టీ బీ-ఫామ్‌పై పోటీ చేయించి తమ ఉనికిని చాటుకున్నారు