సిదిరి అప్పలరాజు కుమారుడి హిట్ అండ్ రన్ కేసు.. కాశీబుగ్గ సీఐ, ఎస్ఐలపై సస్పెన్షన్ వేటు.!
Published on: Mon Jul 20, 2026 7:51AM

వైసీపీ నాయకుడు, మాజీ మంత్రి సిదిరి అప్పలరాజు కుమారుడి హిట్ అండ్ రన్ కేసులో సంచలన వాస్తవాలు బయటకు వస్తున్నాయి. కుర్రోడు చిన్న యాక్సిడెంట్ చేస్తే అరెస్టు చేసేస్తారా? అంటూ వైసీపీ అధినేత జగన్ వెనకేసుకు వచ్చిన సిదిరి అప్పలరాజు కుమారుడు .. ఆరవ్ వర్మ కు కాశీబుగ్గ సీఐ రామకృష్ణ, ఎస్సై సునీల్ కూడా అండగా నిలిచారని వెల్లడైంది. అరవ్ హిట్ అండ్ రన్ కేసులో నిర్లక్ష్యంగా వ్యవహరించిన వీరిద్దరిపై సస్పెన్షన్ వేటు పడింది. విశాఖపట్నం రేంజ్ ఐజీ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. నిందితుడికి అనుకూలంగా వ్యవహరించి, కేసును పక్కదారి పట్టించేందుకు ప్రయత్నించారన్న ఆరోపణలపై వీరిపై సస్పెన్షన్ వేటు వేశారు.
అరవ్ హిట్ అండ్ రన్ సంఘటన ఈ నెల 10న జరిగింది. ఆరవ్ వర్మ అతివేగంగా, అజాగ్రత్తగా ద్విచక్రవాహనాన్ని నడిపి. దానయ్య అనే గొర్రెల కాపరిని ఢీ కొనడంతో అతడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. అయితే.. ప్రమాదం జరిగిన వెంటనే పోలీసులు క్షేత్రస్థాయిలో కనీస విచారణ చేపట్టలేదు. పైగా మాజీ మంత్రి అప్పలరాజు ఒత్తిడికి తలొగ్గిన పోలీసులు.. అసలు నిందితుడైన ఆరవ్ వర్మను రక్షించేందుకు కేసు తప్పుదోవ పట్టించారు. ద్విచక్ర వాహనం రిజిస్ట్రేషన్ వివరాలను సాకుగా చూపి, ఆరవ్ స్నేహితుడైన సిద్ధార్థ్ అనే యువకుడిపై కేసు నమోదు చేసి చేతులు దులుపుకునే ప్రయత్నం చేశారు.
ప్రమాదం జరిగిన మరుసటి రోజు మధ్యాహ్నం వరకూ పోలీసులు కనీసం ఘటనా స్థలానికి వెళ్లకపోవడం, చుట్టుపక్కల ప్రాంతాల్లోని సీసీటీవీ ఫుటేజీలను సేకరించకపోవడంతో పోలీసులు ఉద్దేశపూర్వకంగానే కేసును తప్పుదోవపట్టించి మాజీ మంత్రి సిదిరి అప్పలరాజు కుమారుడిని రక్షంచే ప్రయత్నం చేశారని తేటతెల్లమైంది. ఈ నేపథ్యంలో ప్రజాందోళన వెల్లువెత్తింది. దీంతో ఉన్నతాధికారులు, ప్రభుత్వ ఆదేశాలతో దర్యాప్తు చేపట్టగా.. సమీపంలోని ఓ పెట్రోల్ బంక్ వద్ద లభ్యమైన సీసీటీవీ దృశ్యాలు ఈ కేసులో కీలక సాక్ష్యంగా మారాయి. ఆ సమయంలో ద్విచక్ర వాహనాన్ని నడుపుతోంది సిద్ధార్థ్ కాదని, మాజీ మంత్రి కుమారుడు ఆరవ్ వర్మ సాంకేతిక ఆధారాలతో సహా రూఢీ అయ్యింది.
ఈ సాంకేతిక ఆధారాలు పక్కాగా లభించడంతో పోలీసులు వెంటనే ఆరవ్ వర్మను అరెస్టు చేశారు. పోలీసులను తప్పుదోవ పట్టించేందుకు సహకరించిన నేరం కింద స్నేహితుడు సిద్ధార్థ్ను కూడా అదుపులోకి తీసుకున్నారు. కాగా.. ఈ దర్యాప్తు వ్యవహారం సమయంలో పోలీస్ స్టేషన్ లోని అంతర్గత సమాచారాన్ని స్థానిక అధికారులు ఎప్పటికప్పుడు మాజీ మంత్రి అప్పలరాజుకు, ఆయన అనుచరులకు చేరవేసినట్లు కాల్ డేటా రికార్డుల ద్వారా ఉన్నతాధికారులు గుర్తించారు. బాధ్యతాయుతమైన పదవుల్లో ఉండి దర్యాప్తును నీరుగార్చడం, నిందితులతో కుమ్మక్కవ్వడంతో కాశీబుగ్గ సీఐ, ఎస్సైలపై వేటు పడింది.
ప్రమాదం జరిగిన తీరు, ఆ తర్వాత కేసును మభ్యపెట్టేందుకు చోటుచేసుకున్న పరిణామాలపై రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర చర్చ జరుగుతోంది. స్థానిక ఎమ్మెల్యే గౌతు శిరీషతో సహా పలువురు తెలుగుదేశం నాయకులు బాధితుడి కుటుంబానికి అండగా నిలబడి, పోలీసుల పక్షపాత వైఖరిని ఎండగట్టారు. నిష్పక్షపాతంగా విచారణ జరగాలని వారు పట్టుబట్టడంతోనే ఈ కేసులో దాగిన వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. తొలుత ఈ వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొన్న ఎస్సై సునీల్ ను వీఆర్ కు పంపించారు. అంతర్గత విచారణలో లోపాలు మరింత స్పష్టంగా బయటపడటం, సీఐ స్థాయి అధికారి పాత్ర కూడా ఉన్నట్లు తేలడంతో ఇద్దరినీ సస్పెండ్ చేశారు.
Seediri Appalaraju, Kasibugga hit and run case, SKLM News, Telugu One


