చిదంబరం తనయుడు కార్తికి ఈడీ సమన్లు..

కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి చిదంబరం కుమారుడు కార్తి చిదంబరం చిక్కుల్లో పడ్డాడు. ఎయిర్‌సెల్, మ్యాక్సీస్ ఒప్పందాల వ్యవహారంలో ఆయనకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ సమన్లు జారీ చేసింది. 2006 సంవత్సరంలో మాక్సిస్ సంస్థ అక్రమంగా ఎయిర్‌సెల్‌లో 80 కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టేందుకు అప్పటి ఆర్ధిక మంత్రి చిదంబరం ప్రత్యేక చొరవతో అనుమతిచ్చారని ఎప్పటి నుంచో ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. దీనిపై ఇప్పటికే కార్తి చిదంబరంపై మనీ లాండరింగ్ కేసు నమోదు చేసిన ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్, ఆదాయపు పన్ను శాఖతో కలిసి అతడి ఆస్తులపై సోదాలు నిర్వహించింది. ఈ నేపథ్యంలో కార్తికి నోటీసులు జారీ చేసింది..మ్యాక్సిస్, ఎయిర్‌సెల్ ఒప్పందానికి సంబంధించిన అన్ని డాక్యుమెంట్లతో ఇవాళ ఉదయం ఈడీ కార్యాలయంలో హాజరుకావాలని ఆదేశించింది.