జూన్ 1 నుంచి ఆల‌యాలు తెరిచేందుకు గ్రీన్ సిగ్న‌ల్‌

కరోనా వైరస్ కారణంగా దేశవ్యాప్తంగా దేవాలయాల్లోకి భక్తులను అనుమతించని విషయం తెలిసిందే. భక్తులతో కళకళలాడే దేవాలయాలు రెండు నెలల నుంచి వెలవెలబోతున్నాయి. లాక్‌డౌన్‌ నుండి ఇప్పటికే చాలావాటికి సడలింపులు ఇచ్చిన ప్రభుత్వాలు.. దేవాలయాలకు కూడా ఇవ్వాలని భక్తులు కోరుతున్నారు. ఈ నేపథ్యంలో, భ‌క్తుల‌కు క‌ర్ణాట‌క ప్ర‌భుత్వం శుభ‌వార్త తెలిపింది. జూన్ 1 నుంచి ఆల‌యాలు తెర‌వ‌నున్న‌ట్లు క‌ర్ణాట‌క ప్ర‌భుత్వం ప్రకటించింది. దీంతో, లాక్‌డౌన్‌ తర్వాత ఆలయాలు తెరుస్తున్న మొదటి రాష్ట్రంగా కర్ణాటక నిలిచింది.

ఆలయాలు తెరిచే విషయమై కర్ణాటక సీఎం యడియూరప్ప ఆధ్వర్యంలో సమీక్ష సమావేశం జరిగింది. అనంతరం ఆ రాష్ట్ర మంత్రి కోటా శ్రీనివాస్‌ పూజారి మాట్లాడుతూ.. జూన్‌ 1 నుంచి ఆలయాలను తెరుస్తున్నట్లు ప్రకటించారు. అన్ని రకాల పూజా కార్యక్రమాలు కొనసాగనున్నట్లు తెలిపారు. బుధ‌వారం నుంచి 52 దేవాలయాల్లో ఆన్‌లైన్‌ బుకింగ్‌ సేవా కార్యక్రమాన్ని కూడా ప్రారంభిస్తున్నట్లు చెప్పారు. అన్ని జాగ్రత్తలతో ఆలయాల్లోకి భక్తులను అనుమతిస్తామన్నారు. ఆలయాల్లో భక్తులు భౌతిక దూరం పాటించేలా చూస్తామన్నారు. పరిస్థితులను అనుసరించి పరిమిత సంఖ్యలో మాత్రమే భక్తులను అనుమతిస్తామన్నారు.