TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

కర్కశంగా వ్యవహరిస్తున్న కర్ణాటక ప్రభుత్వం

Published on: Sat Apr 28, 2012 10:13AM

కృష్ణాజలాలను రాష్ట్రానికి విడుదల చేసే విషయంలో కర్ణాటక ప్రభుత్వం అత్యంత కర్కశంగా వ్యవహరిస్తోంది. మెహబూబ్ నగర జిల్లాలో సుమారు 70 వేల ఎకరాలకు జూరాల ప్రాజెక్టు ద్వారా సాగునీరు అందుతోంది. అయితే కర్ణాటకలోని నారాయణపూర్ ప్రాజెక్టు నుంచి నీరు విడుదల చేస్తేనే జూరాల ప్రాజెక్టుకు సాగునీరు అందుతుంది. జూరాల ప్రాజెక్టులో నీటిమట్టం అడుగంటడంతో దానికింద సాగులో ఉన్న 70 వేల ఎకరాల పంట ఎండిపోయే పరిస్థితి ఏర్పడింది. నారాయణపూర్ ప్రాజెక్టు నుంచి నీరు విడుదల చేయాలని జిల్లా రైతాంగం, రాష్ట్రప్రభుత్వం కోరుతున్నప్పటికీ కర్ణాటక ప్రభుత్వం పట్టించుకోవటం లేదు.

 

 

జూరాల ప్రాజెక్టులో నీటిమట్టం డెడ్ స్టోరేజ్ లో పడి సుమారు రెండు వారాలవుతోంది. ఐదు టిఎంసిల నీరు ఉంటే అధికారులు డెడ్ స్టోరేజీగా గుర్తిస్తారు. కానీ, ప్రస్తుతం ఈ ప్రాజెక్టులో 4 టిఎంసిల నీరు మాత్రమే వుంది. ఈ ప్రాజెక్టు కింద సుమారు 70 వేల ఎకరాల వరిపంట ఆధారపడి ఉండి. నీరు సక్రమంగా అందితేనే మే నెల మొదటి, రెండో వారాల్లో పంటలు కోతకు వస్తాయి. కానీ, ప్రాజెక్టులో తగినంత నీరు లేకపోవటంతో వరిపంట ఎండిపోతోంది. ఈ విషయాన్ని రాష్ట్రప్రభుత్వం కర్ణాటక దృష్టికి తీసుకెళ్ళినా ఆ ప్రభుత్వం నిర్దయగా వ్యవహరిస్తోంది. తమ రైతులకే తాగునీరు చాలటం లేదనీ, ఇక జూరాల ప్రాజెక్టుకు నీరు ఎలా అందిస్తామని కర్ణాటక అధికారులు ప్రశ్నిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా చేష్టలుడిగి చూస్తుండటంతో 70 వేల ఎకరాల్లో వరిపంటకు ముప్పు ఏర్పడుతుంది.