హాలు ఏదైనా టికెట్ రూ.200.. కర్ణాటక సర్కారు కీలక నిర్ణయం
Published on: Fri Mar 7, 2025 2:20PM
.webp)
కన్నడ సినీ ఇండస్ట్రీ ప్రమోషన్ కోసం కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధ రామయ్య శుక్రవారం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్లో సినిమా ప్రమోషన్స్కు కీలక కేటాయింపులు చేశారు. ఆ రంగాన్ని ప్రోత్సహించడం కోసం సినిమా టికెట్ ధరలను రూ.200గా నిర్ణయించాలనుకుంటున్నట్లు వెల్లడించారు. మల్టీప్లెక్స్లతో సహా రాష్ట్రంలోని అన్ని థియేటర్లలో అన్ని షోలకు ఇదే రేటు ఉంటుందని సీఎం తెలిపారు. సామాన్యులకు కూడా సినిమాను అందుబాటులోకి తీసుకురావాలనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు.
కన్నడ సినిమాలను ప్రమోట్ చేసేలా రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నడిచే ఓటీటీ ప్లాట్ఫామ్ను సైతం అందుబాటులోకి తీసుకురానున్నట్లు ఆయన ప్రకటించారు. అంతర్జాతీయ ప్రమాణాలతో మైసూర్లో ఒక ఫిల్మ్సిటీ నిర్మించేందుకు 150 ఎకరాల భూమిని ఇస్తున్నట్లు ప్రకటించారు. దీని నిర్మాణానికి రూ.500 కోట్ల బడ్జెట్ను కేటాయిస్తున్నట్లు తెలిపారు.


