కరీంనగర్ లో బజారుపాలైన కాంగ్రెసు
Published on: Tue Apr 24, 2012 10:08AM
కరీంనగర్ జిల్లాలో ప్రత్యేక తెలంగాణా ఉద్యమం కారణంగా కాగ్రేసు పార్టీ కకావికలమైంది. దీనికితోడు ఇప్పుడు నేతల మధ్య ఘర్షణలు కాంగ్రెస్ పార్టీకి శాపంగా మారాయి. ఒక కాంగెస్ నాయకుడికి వ్యతిరేకంగా మరో కాంగ్రెస్ నాయకుడు ధర్నాలు చేసే స్థాయివరకూ వివాదాలు ముదరటంతో పిసిసి అధ్యక్షుడు బొత్సా సత్యనారాయణ జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. కాంగ్రెసు పార్టీలో సీనియర్లు అయిన కటకం మృత్యుంజయం, కొండూరి రవీంద్రరావుల మధ్య గత నెలరోజులుగా పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. వీరిద్దరూ పరస్పరం ఆరోపణలు చేసుకుంటూ బజారుకెక్కుతున్నారు. ఒకరికి వ్యతిరేకంగా మరొకరు ధర్నాలు చేస్తున్నారు.
కొండూరి రవీంద్రరావు ఒకనాడు జిల్లా రాజకీయాలను శాసించారు. శ్రీపాదరావుకు అత్యంత సన్నిహితంగా ఆయన మెలిగారు. కటకం మృత్యుంజయం పిసిసీ అధికార ప్రతినిధిగా ఉన్నారు. మొదటి కొండూరి, ఆయన కుటుంబసభ్యులపై కటకం మృత్యుంజయం భూకబ్జా ఆరోపణలు చేశారు. దీనితో రెచ్చిపోయిన కొండూరి, కటకం మృత్యుంజయం భాగోతాల చిట్టా విప్పారు. ఇలా ప్రారంభమైన గొడవ చివరకు ధర్నాల స్థాయి వరకూ చేరటంతో ఈ సమస్యను పరిష్కరించాలని ఎంపి పొన్నం ప్రభాకర్ ను పిసిసి అధ్యక్షుడు బొత్సా సత్యనారాయణ ఆదేశించారు. పార్టీ పరిస్థితి జిల్లాలో ఇప్పటికే అధ్వాన్నంగా ఉందని, ఒకరిపై మరొకరు ఆరోపణలు చేసుకుంటూ రోడ్డుమీద పంచాయితీలు పెట్టుకుంటే ఎలా అని పొన్నం ప్రభాకర్ ఆ ఇద్దరు నాయకులను ప్రశ్నించినట్లు తెలిసింది.


