సీఎం జగన్ కు కాపు ఉద్యమ నేత వార్నింగ్ తో కూడిన విన్నపం
posted on Jul 3, 2020 11:03AM
కాపుల రిజర్వేషన్లపై ప్రధాని మోడీతో వెంటనే మాట్లాడి రిజర్వేషన్లు కల్పించాలంటూ కాపు ఉద్యమ నాయకుడు ముద్రగడ పద్మనాభం సీఎం జగన్ కు లేఖ రాశారు. కాపుల సమస్యలు వెంటనే తీర్చాలని తన లేఖలో ఆయన డిమాండ్ చేశారు. అడిగిన వారికి, అడగని వారికి అన్నీ ఇస్తూ ధానకర్ణుడులా పేరు తెచ్చుకుంటున్న మీరు, మా సమస్య ను కూడా పరిష్కరించాలని అయన కోరారు.
మీ పార్టీ విజయంలో కాపు జాతి కూడా ఉందని అంటూ.. ప్రజల యొక్క సమస్యలను తీర్చి నవీన్ పట్నాయక్, జ్యోతిబసు, వైఎస్ లాగా మీరు కూడా పేరు తెచ్చుకోవాలని, అల్లా కాకపోతే అది ముణ్ణాళ్ల ముచ్చటే అవుతుందని ముద్రగడ సున్నితంగా హెచ్చరించారు. కాపులకు బీసీ రిజర్వేషన్లు అనేది తమ అంతిమ కోరిక అని, తమను బీసీలో కలపాలన్న డిమాండ్ కు మీరు కూడా గతంలో మద్ధతిచ్చారంటూ ముద్రగడ సీఎం జగన్ కు గుర్తు చేశారు. ఐతే కాపు రిజర్వేషన్ల అంశంపై ముద్రగడ పద్మనాభం వైసీపీ ప్రభుత్వాన్నిమొదటి సారిగా కాస్త గట్టిగానే డిమాండ్ చేయడం ఎపి రాజకీయవర్గాల్లో ప్రాధాన్యత సంతరించుకుంది.