సీఎం జగన్, ప్రతిపక్ష నేత చంద్రబాబుల పై కన్నా ఫైర్
posted on Aug 17, 2019 12:40PM
ఏపీలో కృష్ణ నదికి వచ్చిన వరదలతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్న విషయం తెలిసిందే. ఈ వరదలలో నది ఒడ్డున ఉన్న టీడీపీ అధినేత నివాసం ఉంటున్న అక్రమ కట్టడం కూడా మునగవచ్చని అధికార పార్టీ వైసిపి, అసలు మీకు ఆ నివాసం తప్ప వరదలతో సామాన్యులు పడుతున్న ఇబ్బందులు పట్టవా అని టీడీపీ ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకుంటున్నారు. ఇప్పుడు దీనిపై ఎపి బీజేపీ అధ్యక్షుడు ట్విట్టర్ వేదికగా ఘాటుగా స్పందించారు. ఒక వైపు రాష్ట్రం వరదలతో అల్లాడుతుంటే ప్రజల బాగోగులు పట్టించుకోని సీఎం జగన్ అమెరికా వెళ్లారని కన్నా విమర్శించారు. అదే సమయంలో ఐదేళ్ల పాటు రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచిన చంద్రబాబు తన కొంప మునిగిపోవడంతో ఇప్పుడు హైదరాబాద్ కు జారుకున్నాడని ఎద్దేవా చేశారు. ఇక వారిద్దరి తోక నేతలు " ఇల్లు మునిగిందా, లేదా " అనే అనవసర చర్చతో టైం వేస్ట్ చేస్తున్నారని ఘాటుగా విమర్శించారు. అలాగే "ఆ ఇల్లు సంగతి వదిలేయండి మీ రెండు పార్టీల వలన రాష్ట్రం నిండా మునుగుతోందని" అని ఆ రెండు పార్టీల నేతలను హెచ్చరిస్తూ ట్విట్ చేశారు.