రాజకీయ యాత్రను ప్రారంభించిన కమల్..
posted on Feb 21, 2018 10:09AM
తమిళనాడు రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. తమిళనాడు విలక్షణ నటుడు కమల్ హాసన్ గత రోజుల క్రితమే రాజకీయాల్లోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే కదా. ఈ నేపథ్యంలో ఆయన మరో అడుగు ముందుకేశారు. తన రాజకీయ యాత్రను ప్రారంభించారు. రామేశ్వరంలోని అబ్దుల్ కలామ్ స్వగృహం నుంచి ఆయన రాజకీయ యాత్ర ప్రారంభించారు. కలామ్ కు నివాళులు అర్పించిన ఆయన, రామేశ్వరం, పరమకొడి, మధురై ప్రాంతాల్లో జరిగే బహిరంగ సభల్లో ప్రజలు, అభిమానులను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. అంతేకాదు మధురైలో జరిగే సభలోనే కమల్ పార్టీ పేరు, జెండా తదితర వివరాలను ప్రకటించనున్నట్టు సమాచారం.
కాగా, నేడు కమల్ మధురైలో నిర్వహించే సభకు అరవింద్ కేజ్రీవాల్ ముఖ్య అతిథిగా పాల్గొననుండటం గమనార్హం. దీంతో ఈ సభను కవర్ చేసేందుకు దేశవ్యాప్తంగా అన్ని ప్రముఖ మీడియా సంస్థలకూ ఆహ్వానాలు అందాయి. ఢిల్లీ, కోల్ కతా, ముంబై తదితర ప్రాంతాల నుంచి కూడా వార్తాసంస్థల ప్రతినిధులు ఇప్పటికే మధురై చేరుకున్నారని తెలుస్తోంది.