కల్వకుంట్ల కవిత పీఏపై ఫ్యాన్స్ దాడి.. అక్క ఓటమికి నువ్వే కారణమంటూ?

 

తెలంగాణ లోక్ సభ పోరులో సీఎం కేసీఆర్ కూతురు కవిత ఓటమి.. టీఆర్ఎస్ కు గట్టి షాక్ అనే చెప్పాలి. కవిత ఓటమితో టీఆర్ఎస్ శ్రేణులు నిరాశ చెందారు. అయితే కొందరు టీఆర్ఎస్ కార్యకర్తలు, కవిత అభిమానులు మాత్రం.. కవిత ఓటమిని సొంత వారే కారణమని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కవిత పీ ఏ శరత్ పై ఆమె అభిమానుల్లో ఒకరు దాడి చేసిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

మాదాపూర్ లోని కవిత నివాసానికి ఆమెను కలవడానికి అభిమానులు వచ్చారు. అక్కడే ఉన్న కవిత పీ ఏ శరత్ ను చూడగానే కోపోద్రిక్తులైన అభిమానులు వాదనకు దిగినట్టు తెలుస్తోంది. బూతులు తిడుతూ నీ వల్లే మా అక్క ఓడిపోయింది కదరా అంటూ ఓ అభిమాని పిడిగుద్దులు గుద్దారట. తీవ్రంగా చితకబాదేందుకు ప్రయత్నిస్తుండగా అక్కడ ఉన్న వారు వారించినట్టు సమాచారం. కవిత ఇంటి ముందే జరిగిన ఈ సంఘటన కవిత దృష్టికి వెళ్లడంతో.. కోపంతో ఊగిపోతున్న తన అభిమానులను లోపలికి పిలిచి కూర్చోబెట్టి సముదాయించినట్టు తెలుస్తోంది.

కాసేపటి తర్వాత బయటికి వచ్చిన అభిమానులు నవీనాచారీ కోసం ఎదురు చూశారట. మా అక్క నవీనా చారీని ఎక్కువ నమ్మిందని వాడు అంతా తప్పుడు సమాచారం ఇస్తూ, ఎన్ఆర్ఐ ల దగ్గర ఐ ఫోన్ లు, ఎలక్ట్రానిక్, విలువైన వస్తువులకు ఆశపడి నిజమైన కార్యకర్తలను అక్కకు దూరం చేశాడని, వాడి పిచ్చి చేష్టల వల్ల కష్టకాలంలో అక్కతో ఉన్న వారు ఎంపీ అయ్యాక అక్కను విడిచి వెళ్ళారని తెలిపారు. అతను ఇక్కడికి వస్తే తన్నిపోదామని చాలా సేపు ఎదురు చూశారట.. కానీ అతను రాకపోవడంతో చాలాసేపు ఎదురు చూసి వెళ్ళిపోయారట. అనంతరం శరత్ వాడుతున్న సిమ్ కార్డును తీసుకొని ఇంకోసారి అక్క కవిత ఇంటి పరిసరాల్లోకి రావద్దని వార్నింగ్ ఇచ్చి పంపించినట్లు సమాచారం.