కేటీఆర్ వి రాజరిక, నియంతృత్వ పోకడలు.. కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
Published on: Mon Feb 2, 2026 12:51PM
.webp)
తెలంగాణ జాగృతి అధినేత్రి కల్వకుంట్ల కవిత మరో సారి, తన సోదరుడు, బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కల్వకుంట్ల తారకరామారావు లక్ష్యంగా సంచలన విమర్శలు చేశారు. కేటీఆర్ వి రాజరిక, నియంతృత్వ పోకడలంటూ ఫైర్ అయ్యారు. మునిసిపల్ ఎన్నికలలో తమ పార్టీ అభ్యర్థి మంచివాడు కాకపోయినా కేసీఆర్ ముఖం చూసి ఓటేయాలంటూ కేటీఆర్ అనడాన్ని తప్పుపట్టారు. ఇది ఆయన నియంతృత్వ ధోరణికి నిదర్శనమని దుయ్యబట్టారు.
మున్సిపల్ ఎన్నికల్లో తెలంగాణ జాగృతి అభ్యర్థులను రంగంలోకి దింపాలని నిర్ణయించిన కవిత.. ఇప్పుడు బీఆర్ఎస్ టార్గెట్ గా రాజకీయ విమర్శలకు దిగడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇంత కాలం మాజీ మంత్రి హరీష్ రావు, మాజీ ఎంపీ సంతోష్ లు టార్గెట్ గా అవినీతి ఆరోపణలకే పరిమితమైన కవిత.. ఇప్పుడు తన సోదరుడు కేటీఆర్, తండ్రి కేసీఆర్ లను కూడా వదలకుండా పొలిటికల్ విమర్శలకు దిగడం బీఆర్ఎస్ శ్రేణులను బెంబేలెత్తిస్తున్నది.
కేటీఆర్ వి నియంతృత్వ పోకడలంటూ ఆమె చేసిన విమర్శలు రాజకీయంగా సంచలనం సృష్టిస్తున్నాయి. ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ కేసీఆర్ ను విచారించడమే తప్పని కేటీఆర్ అనడాన్ని కూడా ఆమె తప్పుపట్టారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణ ఫెయిర్ గా జరగాలన్నారు. ఈ కేసులో సిట్ విచారణకు పిలిస్తే ఎవరైనా వెళ్లక తప్పదని కవిత స్పష్టం చేశారు.


