TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

ఆవేశం కాదు...అవగాహనే కుటుంబ బంధాలకు బలం : డీజీపీ సీవీ ఆనంద్

Published on: Sat Jun 6, 2026 6:36PM

 

 

దాంపత్య బంధాన్ని కాపాడేది సహనం, సంభాషణే..

కుటుంబ కలహాలు, భార్యాభర్తల మధ్య పెరుగుతున్న విభేదాలు, వాటి కారణంగా చోటుచేసుకుంటున్న విడాకులు, హత్యలు, ఆత్మహత్యలు వంటి విషాద ఘటనలు రోజురోజుకీ పెరుగుతున్న నేపథ్యంలో మల్కాజిగిరి పోలీస్ కమిషనరేట్ పరిధిలోని ఇంటీరియల్ గార్డెన్‌లో సీపీ సుమతి ఆధ్వర్యంలో “కలిసి ఉంటే కలదు సుఖం” కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర డీజీపీ సీవీ ఆనంద్ ముఖ్య అతిథిగా హాజరుకాగా, సీఐడీ డీజీ చారు సిన్హా కూడా పాల్గొన్నారు.

మహిళల భద్రత కోసం చేపడుతున్న “మీ సురక్ష” కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన ఈ సమావేశంలో భరోసా కేంద్రాల సహాయంతో తిరిగి కలిసిన దంపతులను ప్రత్యేకంగా ఆహ్వానించారు. కుటుంబ సమస్యలను చర్చల ద్వారా పరిష్కరించుకుని మళ్లీ కలిసి జీవనం సాగిస్తున్న జంటలు తమ అనుభవాలను సభలో పంచుకున్నారు.

ఈ సందర్భంగా డీజీపీ సీవీ ఆనంద్ మాట్లాడుతూ, భార్యాభర్తల బంధం ఎంతో అపురూపమైందని పేర్కొన్నారు. దాంపత్య జీవితంలో చిన్న చిన్న విభేదాలు సహజమేనని, అయితే ఆవేశంలో మాట్లాడే మాటలే పెద్ద సమస్యలకు దారితీస్తాయని అన్నారు.

“గొడవ జరిగిన సమయంలో క్షణిక ఆవేశానికి లోనుకాకుండా కొంత సమయం మౌనం పాటించడం చాలా సందర్భాల్లో సమస్యలను తగ్గిస్తుంది. భార్యాభర్తల మధ్య వివాదాలు వచ్చినప్పుడు మాటలను అదుపులో పెట్టుకోవడం ఎంతో ముఖ్యం. ఆలోచించి మాట్లాడితే చాలా సమస్యలు పరిష్కారమవుతాయి. మాటల వల్లే అనేక గొడవలు పెద్దవిగా మారుతాయి” అని డీజీపీ సూచించారు.

తన వ్యక్తిగత జీవితంలో కూడా ఇలాంటి సందర్భాలు ఎదురైనప్పుడు కొంతసేపు మౌనం పాటించి, బయటకు వెళ్లి ప్రశాంతంగా ఆలోచించే అలవాటు ఉందని ఆయన తెలిపారు. మహిళల భద్రత, కుటుంబ వ్యవస్థ పరిరక్షణకు రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని డీజీపీ స్పష్టం చేశారు. కుటుంబ తగాదాల కారణంగా విడిపోయిన దంపతులను భరోసా కేంద్రాల ద్వారా కౌన్సెలింగ్ చేసి మళ్లీ కలిపే ప్రయత్నాలు విజయవంతంగా కొనసాగుతున్నాయని వెల్లడించారు.

“కలిసి ఉంటే కలదు సుఖం” అనే సందేశంతో నిర్వహించిన ఈ కార్యక్రమం ద్వారా దంపతులు పరస్పర అవగాహన, సహనం, సంభాషణల ద్వారా కుటుంబ బంధాలను మరింత బలోపేతం చేసుకోవాలని అధికారులు సూచించారు. కుటుంబం సంతోషంగా ఉంటే సమాజం కూడా ప్రశాంతంగా ఉంటుందనే సందేశాన్ని ఈ కార్యక్రమం ద్వారా అందించారు.