TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

కాళీ వ్యాఖ్యల వివాదం.. తృణమూల్ కు మహువా గుడ్‌బై

Published on: Sat Jul 9, 2022 5:55AM

కాళీమాతపై తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మొయిత్రా చేసిన వ్యాఖ్యలు రగిల్చిన వివాదం ఇంకా రగులుతూనే వుంది. వివాదస్పద దర్శకురాలు, రచయిత్రి, నటి లీనా మణి మేగలై నిర్మించిన 'కాళీ' సినిమాకి సంబంధించిన  వివావదస్పద పోస్టర్‌ పై మహువా చేసిన వ్యాఖ్యలు అగ్నికి ఆజ్యం తోడైంది అన్నట్లుగా, ‘పోస్టర్’ వివాదాన్ని రాజకీయ వివాదంగా చేసింది. 

కాళీమాతను మాంసాహారి, మద్యం సేవించే దేవతగా తాను నమ్ముతున్నానంటూ మహువా మొయిత్రా చేసిన వ్యాఖ్యలపై ఒక్క పశ్చిమ బెంగాల్ లోనే కాదు, దేశంలో ఇంకా అనేక చోట్ల నిరసనలు వ్యక్తం వుతున్నాయి. మహువా వ్యాఖ్యలు హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా ఉన్నాయని, బీజేపీ,ఇతర సంఘ్ పరివార్ సంస్థలు ఆమెను అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తున్నాయి. బీజేపీ పాలిత రాష్ట్రాలలో ఆమె పై పోలీసు కేసులు కేసులు  నమోదయ్యాయి. ముఖ్యంగా పశ్చిమ బెంగాల్లో పరిస్థితి అదుపు తప్పుతున్న సకేతాలు స్పష్టమవుతున్నాయి. 

మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కూడా మహువా వ్యాఖ్యలు తీవ్రంగా తప్పుబట్టారు. కాళీమాతపై ఆమె చేసిన వ్యాఖ్యలు హిందువుల మనోభావాలను దెబ్బతీశాయని, హిందూ దేవతలను అవమానిస్తే సహించేది లేదని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలోనే ఎంపీ మహువాపై మధ్యప్రదేశ్ భోపాల్‌ క్రైం బ్రాంచ్‌ పోలీసులు కేసు నమోదు చేశారు.

అయితే మహువా వ్యాఖ్యలు ఆమె వ్యక్తిగతమని, వాటితో పార్టీకి ఎలాంటి సంబంధం లేదని తృణమూల్ కాంగ్రెస్ స్పష్టం చేసింది. అయినా ఆమెను పార్టీ సస్పెండ్ చేయాలనీ, బీజేపీ డిమాండ్ చేయడమే కాకుండా బెంగాల్’లో ఆందోళనకు పిలుపు ఇచ్చింది. ఈ నేపథ్యంలో పశ్చిమ బెంగాల్  ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, తమ పార్టీ ఎంపీ వ్యాఖ్యలపై పరోక్షంగా స్పందించారు.  మనుషులు తప్పులు చేస్తారని.. వాటిని సరిదిద్దుకోవచ్చని హితవు పలికారు. అలాంటి, తప్పులు చేసి సరిదిద్దుకున్న అనుభవాలు తనకూ ఉన్నాయని చెప్పుకొచ్చారు. కొందరు మంచి పనిని సహించక వివాదాలు సృష్టించవచ్చును. కానీ, ప్రతికూల ఆలోచనలు మెదడుకు మంచిది కాదు. అందుకే సానుకూల దృక్పథంతో అలోచించండి, అంటూ మమతా బెనర్జీ పేర్కొన్నారు. 

అయితే, మహువా మాత్రం, తగ్గేదేలే’ అంటున్నారు. తృణమూల్ కాంగ్రెస్‌ తమ వ్యాఖ్యలను  ఖండిస్తూ ట్వీట్ చేసిన వెంటనే, ఆమె పార్టీ అధికారిక ట్విట్టర్ ఖాతాను అన్‌ఫాలో చేశారు. ఇక ఇప్పుడు ఏకంగా తృణమూల్ కాంగ్రెస్ పార్టీకే గుడ్‌బై చెప్పేందుకు సిద్దమైనట్లు తెలుస్తోంది. బీజేపీ వత్తిళ్ళకు తలొగ్గి మమతా బెనర్జీ తనపై చర్యలు తీసుకుంటే, పార్టీని వదిలేందుకు కూడా వెనకడేది లేదని ఆమె పార్టీ నాయకులకు స్పష్టం చేసినట్లు తెలుస్తోంది.

అయితే, ముఖ్యమంత్రి మమత బెనర్జీ మాత్రం, మత ఉద్రిక్తలకు దారితీసీ పరిస్థితులు తలెత్తకుండా చూసేందుకు మహువాపై చర్యలు తప్పవని బావిస్తున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా, మహువా వ్యాఖ్యలతో సంబంధం ఉన్న లేకున్నా ఒకే రోజు ముగ్గురు తృణమూల్ కార్యకర్తలు హత్యకు  గురైన నేపధ్యంలో, పరిస్థితి మరింతగా దిగజారి పోకముందే దిద్దుబాటు చర్యలు తీసుకోవాలని మమతా బెనర్జీ భావిస్తునట్లు తెలుస్తోంది. అదే జరిగితే, మహువా పార్టీకి గుడ్‌బై చెప్పడం ఖాయమని అంటున్నారు.