కళాబంధు డిస్టలరీతో నిజాం వాసులు విలవిల
Published on: Fri Apr 13, 2012 10:33AM
కళాబంధు డాక్టర్ టి.సుబ్బిరామిరెడ్డి వైఖరిపై నిజామాబాద్ జిల్లా ఎడ్లూరు ఎల్లారెడ్డి వాసులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆయన యాజమాన్యంలో గాయత్రి షుగర్స్ కు అనుబంధంగా ఉన్న డిస్టలరీ నుంచి వ్యర్థజలాలు, వాసనలతో ఎడ్లూరు ఎల్లారెడ్డి ప్రజలు తీవ్ర అస్వస్థతకు గురవుతున్నారు. ఈ డిస్టలరీ నుంచి వ్యర్థజలాలను ఫ్యాక్టరీ యాజమాన్యం బహిరంగ ప్రదేశాల్లో వదిలేస్తోంది. దీనివల్ల ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో భూగర్భజలాలు పూర్తిగా కలుషితమయ్యాయి. అంతేకాక ఈ డిస్టలరీ నుంచి వస్తున్నా వాసనలతో స్థానికులు రోగాలపాలవుతున్నారు. తాగటానికి నీరు లేక, పీల్చతానికి గాలి కూడా లేకుండా చేస్తున్న డాక్టర్ సుబ్బిరామిరెడ్డి డిస్టలరీని మూసివేయాలని స్థానికులు గత నెలరోజులుగా ఆందోళనలు చేస్తున్నారు.
ప్రచారం కోసం కోట్లాది రూపాయలు తగలేసే సుబ్బిరామిరెడ్డి, స్థానిక ప్రజల సంక్షేమం కోసం ఎందుకు కృషిచేయరని వారు ప్రశ్నిస్తున్నారు. నిజానికి సుమారు 10కోట్ల రూపాయలు ఖర్చుతో కొత్త యంత్రాలను ఏర్పాటు చేస్తే ఈ కాలుష్యసమస్య తీరుతుంది. కళాపీఠాల ఏర్పాటుకు, సినీ కళాకారుల సన్మానాలకు కోట్లాది రూపాయలు ఖర్చుచేస్తున్న సుబ్బిరామిరెడ్డి కాలుష్య నివారణకు చర్యలు చేపట్టకపోవటం దారుణమని వారు అంటున్నారు. ఈ నెల 17వ తేదీ లోపు డిస్టలారీని మూసివేయకపోతే తామే దానిపై దాడి చేసి మూసివేస్తామని వారు హెచ్చరిస్తున్నారు


