వైభవోపేతంగా ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జనం
Published on: Sat Sep 6, 2025 2:49PM

ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జనం లక్షలాది మంది భక్తుల సమక్షంగా, గణపతి బొప్పా మోరియా నినాదాల నడుమ అత్యంత వైభవంగా జరిగింది. శనివారం (సెప్టెంబర్ 6) ఉదయం ఏడు గంటలకు ప్రారంభమైన ఖైరతాబాద్ గణేషుడి నిమజ్జన శోభాయాత్ర భక్త జనసందోహం నిరాజనాల మధ్య మధ్యాహ్నం 12 గంటల సమయానికి టాంక్ బండ్ చేరుకుంది. 69 అడుగుల ఎత్తు, 50 టన్నుల బరువు ఉన్నవిశ్వశాంతి మహాశక్తి మహాగణపతిని గంగమ్మ ఒడిలోకి చేర్చేందుకు ఎస్టీసీ ట్రాన్స్ పోర్టుకు చెందిన26 టైర్ల ప్రత్యేక వాహనం ఏర్పాటు చేశారు.
100 టన్నుల బరువును మోయగల సామర్థ్యం ఉన్న ఈ భారీ ట్రాలీపై మహాగణపతిని నిమజ్జన ప్రాంతానికి తీసుకువచ్చారు. గణపతికి ఇరువైపులా ఉన్న పూరీ జగన్నాథ్ స్వామి, లలితా త్రిపుర సుందరి, లక్ష్మీ సమేత హయగ్రీవ స్వామి, గజ్జలమ్మ దేవత విగ్రహాలను మరో వాహనంపై ఊరేగించారు. ఈ సందర్భంగా మహాగణపతిని చూసేందుకు పోటెత్తిన భక్త జనంతో ట్యాంక్ బండ్, ఎన్టీఆర్ మార్గ్ పరిసరాలన్నీ కిటకిటలాడాయి.
ఎన్టీఆర్ మార్గ్లోని నాలుగో నంబర్ క్రేన్ వద్దకు విగ్రహాన్ని చేర్చారు. అక్కడ ఖైరతాబాద్ ఉత్సవ సమితి సభ్యులు స్వామివారికి తుది పూజలు నిర్వహించారు. పూజల అనంతరం, భారీ క్రేన్ సాయంతో లంబోదరుణ్ణి నెమ్మదిగా హుస్సేన్ సాగర్లోకి నిమజ్జనం చేశారు.


