TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

కడియం మోచేతి నీటి సిద్ధాంతం

Published on: Tue May 12, 2015 12:22AM

 

ఆంధ్రావారి మోచేతి నీటిని తాగుతున్నారంటూ టీఆర్ఎస్ నాయకులు తెలంగాణ టీడీపీ నాయకులను విమర్శిస్తూ వుంటారు. అయితే అలా విమర్శిస్తున్న వారు కూడా గతంలో ఆంధ్రావారి మోచేతి నీటిని తాగినవారేనని టీటీడీపీ నాయకులు ప్రతి విమర్శలు చేస్తూ వుంటారు. తెలంగాణ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి ఈమధ్యకాలంలో తరచుగా ఈ పదాన్ని ఉపయోగిస్తున్నారు. రాజకీయ లబ్ధి కోసమే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తూ వుంటారన్న విషయం తెలిసిందే. అయితే సమయం సందర్భం లేకుండా ఇలాంటి వ్యాఖ్యలు చేస్తూ వుండటమే ఇబ్బందులు తెచ్చిపెడుతోంది. మొన్నటి వరకూ తెలుగుదేశం పార్టీలో అనేక హోదాలు, పదవులు అనుభవించిన కడియం శ్రీహరి ఇప్పుడు టీఆర్ఎ‌స్‌లో వుండేసరికి టీడీపీ ఆంధ్రాపార్టీ అయిపోయింది. పార్టీ కార్యక్రమాలతోపాటు అధికార కార్యక్రమాలలో కూడా కడియం శ్రీహరి తెలుగుదేశం పార్టీని, ఆ పార్టీలో ఉన్నవారిని విమర్శిస్తున్నారు. ఇటీవల వరంగల్ జిల్లాలో జరిగిన అధికార కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకుడు కడియం శ్రీహరి, టీడీపీ నాయకుడు ఎర్రబెల్లి దయాకరరావు పాల్గొన్నారు. ఆ వేదిక మీద శ్రీహరి ఆంధ్రా పార్టీ మోచేతి నీళ్ళు అనే పాత పాట పాడటం మొదలుపెట్టారు. దాంతో తిక్కరేగిన ఎర్రబెల్లి దయాకరరావు కడియం శ్రీహరిని ఒక్క దులుపు దులపడంతో ఆయన గప్‌చుప్ అయిపోవాల్సి వచ్చింది. తెలుగుదేశం పార్టీని, ఆంధ్రప్రదేశ్‌ని ఇంతలా విమర్శించే కడియం శ్రీహరి మొన్నీమధ్య ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసి తెలంగాణలోని రేయాన్స్ ఫ్యాక్టరీకి అవసరమైన ముడిసరుకును ఆంధ్రప్రదేశ్ నుంచి అందించాలని, అది కూడా 50 శాతం సబ్సిడీతో ఇవ్వాలని రిక్వెస్ట్ చేశారు. మరి ఆంధ్రావారి మోచేతి నీళ్ళు తాగడానికి ప్రయత్నిస్తోంది కడియం శ్రీహరే కదా అని తెలంగాణ టీడీపీ వర్గాలు విమర్శిస్తున్నాయి.