భద్రతపై కేఏ పాల్ హైదరాబాద్ సీపీకి ఫిర్యాదు

 

ప్రముఖ మతబోధకుడు, ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ హైదరాబాద్ సీపీ అంజనీ కుమార్ ని కలిశారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, ఏపీ ప్రతిపక్ష నేత, వైకాపా అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి నుంచి తనకు ప్రాణహాని ఉందని ఆరోపించారు. వారిద్దరూ తన హత్యకు కుట్ర పన్నుతున్నారని, తనకు భద్రత కల్పించాలని సీపీని కోరారు. అలాగే తనపై చేస్తున్న అసత్య ప్రసారాలు, యూట్యూబ్‌ చానళ్లలో తనపై పోస్టు చేస్తున్న కామెడీ క్లిప్పింగులను ఆయనకు అందించారు. మొత్తంగా వంద యూట్యూబ్ చానళ్లు, కొన్ని వెబ్‌సైట్లు, కొంతమంది వ్యక్తులపై ఫిర్యాదు చేశారు. తనపై అసత్య ప్రసారాలు చేస్తున్న అందరిపైనా చర్యలు తీసుకోవాలని కోరారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. త్వరలోనే తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావును కలుస్తానని తెలిపారు. ఒంగోలు పోలీస్ స్టేషన్‌లో తనపై ఉన్న పాత కేసులను తిరగదోడి ఇబ్బంది పెట్టాలని చంద్రబాబు ప్లాన్ చేస్తున్నారని పాల్ ఆరోపించారు. తమ్ముడి హత్య కేసులో క్లిన్ చిట్ వచ్చినా సోషల్ మీడియా లో కావాలనే తనపై చంద్రబాబు అసత్య ప్రచారాలు చేయిస్తున్నారని కేఏ పాల్ పేర్కొన్నారు.