TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

రేపోమాపో కేసీఆర్ అరెస్ట్.. గ‌వ‌ర్న‌ర్‌ను క‌లిసిన‌ పాల్.. జ‌గ‌న్‌పై సెటైర్లు..

Published on: Wed Apr 13, 2022 12:22PM

పాల్ మ‌ళ్లీ ప్ర‌త్య‌క్ష‌మ‌య్యారు. ఇన్నాళ్లూ ఏ దేశంలో ఉన్నారో ఏమో.. ఏ విమానంలో వ‌చ్చారో ఏమో కానీ.. స‌డెన్‌గా హైద‌రాబాద్‌లో ప్ర‌త్య‌క్ష‌మ‌య్యారు. మ‌ళ్లీ త‌న‌దైన స్టైల్‌లో చిట‌ప‌ట‌లాడారు. చిల‌క జోస్యం కూడా చెప్పారు. అయితే, ఈసారి ఏపీ పాలిటిక్స్ మీద కాకుండా.. తెలంగాణ మీద నోరేసుకొని ప‌డ్డారు. సీఎం కేసీఆర్ పాలన అవినీతిమయమని కేఏ పాల్ విమర్శలు గుప్పించారు. 

అనూహ్యంగా బుధవారం గవర్నర్‌ తమిళిసైతో భేటీ అయ్యారు కేఏ పాల్‌. అనంతరం మీడియాతో మాట్లాడుతూ కేసీఆర్‌ను కుమ్మేశారు. ఇంత అవినీతి ఎప్పుడూ చూడలేదన్నారు. రేపో మాపో కేసీఆర్ అరెస్ట్ కావడం ఖాయమన్నారు. అందుకే తమిళసై మీద కేటీఆర్‌తో మాట్లాడిస్తున్నారని అన్నారు. కోట్ల అవినీతి పక్కదారి పట్టించడానికి మాట్లాడుతున్నారని ఆరోపించారు. కేసీఆర్‌కు కళ్లు నెత్తికి ఎక్కాయని మండిపడ్డారు. కేసీఆర్ అక్రమపాలన అంతం చేయడానికే అమెరికా నుంచి వచ్చినట్లు తెలిపారు పాల్‌.

కేసీఆర్‌కు 30 సీట్లు కూడా రావని ప్రశాంత్ కిషోర్ త‌న‌తో చెప్పారన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో జార్జ్ బుష్, బిల్ క్లింటన్‌ను హైదరాబాద్‌కు తీసుకు వచ్చింది తానే అని చెప్పుకొచ్చారు. తెలంగాణ‌లో కేసీఆర్‌కు ప్రత్యామ్నాయం తానే అన్నారు. కేసీఆర్ విజయనగరం నుంచి వచ్చారని, తాను వైజాగ్ నుంచి వచ్చినట్టు పాల్‌ తెలిపారు. 

ఆంధ్ర అంధకారంలోకి వెళ్ళిందని, అప్పుల పాలైందని కేఏ పాల్ ఫైర్ అయ్యారు. 20 ఏళ్లు ఎవరు అధికారంలో ఉన్నా ఏపీ అప్పు తీరదని స్పష్టం చేశారు. సీఎంగా జగన్ పూర్తిగా ఫెయిల్ అయ్యారని కేఏ పాల్ మండిప‌డ్డారు.