నా వల్లే మోదీ ప్రధాని.. సపోర్ట్ చేయొద్దని బ్రతిమాలిన అద్వానీ

 

కేఏ పాల్.. ఈ పేరు సుపరిచితమే. ముఖ్యంగా సోషల్ మీడియాలో బాగా ఫేమస్. అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ ని గెలిపించింది నేనే అంటారు. పెద్ద పెద్ద పొలిటిషీయన్స్ తన సపోర్ట్ కోరుతున్నారంటారు. ఇలా ఎవరి ఊహలకు అందని విషయాలు ఎన్నెన్నో చెప్తుంటారు. ఆ మాటలు విని ప్రజలు నవ్వుకుంటున్నా ఆయన మాత్రం అలా మాట్లాడటం మానరు. తాజాగా ఆయన మోదీ, ఎల్ కే అద్వానీ గురించి సంచలన వ్యాఖ్యలు చేసారు.

ప్రజాశాంతి పార్టీ వ్యవహారాల గురించి తెలియజేసేందుకు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కేఏ పాల్ మాట్లాడుతూ.. 2014లో తాను మద్దతు ఇవ్వడం వల్లే మోదీ ప్రధాని అయ్యారని చెప్పారు. మోదీయే తన వద్దకు వచ్చి అడగడం, సెక్యులరిజం అని చెప్పడంతో ప్రచారం చేశానన్నారు. 'మీరు బీసీ, నేను బీసీ. నాకు ఫ్యామిలీ లేదు. మీకూ ఫ్యామిలీ లేదు. దేశమే మన ఫ్యామిలీ. ఇద్దరం కలిసి దేశాన్ని అభివృద్ధి చేద్దామని గంటా నలభైఐదు నిమిషాలపాటు  నాతో చర్చించారు' అన్నారు. బీజేపీ ప్రెసిడెంట్లు, సెక్రెటరీలు.. ఇలా అందరినీ అమెరికా పంపించి.. రిక్వెస్ట్ చేసి, ఇది చేసి, అది చేసి ఎంతగా నన్ను వేడుకున్నారంటే.. ఒక చిన్న కుర్రాడిలా మోదీ బిహేవ్ చేశారు అంటూ సంచలన వ్యాఖ్యలు చేసారు.
 
అంతటితో ఆగితే ఆయన కేఏ పాల్ ఎందుకు అవుతారు. మోదీకి సపోర్ట్ చేయొద్దని అద్వానీ బ్రతిమాలారని మరో బాంబు పేల్చారు. '2013 అక్టోబర్ 1న చేతులు జోడించి గంటన్నరపాటు చెప్పారు. మోదీకి సపోర్ట్ చేయొద్దు. అతను ఒక్క హామీని కూడా నెరవేర్చడని చెప్పారు. ఆయనే తన ఇంటికి డిన్నర్‌కు పిలిచి ఈ విషయం చెప్పారు. నేను మోదీగారి ఇంటికి వెళ్లలేదు. ఆయనే నా దగ్గరికి వచ్చారు. కానీ అద్వానీ గారి ఇంటికి వెళ్లాను.’ అని కేఏ పాల్ వెల్లడించారు.