ఇసుకమాఫియాపై సీబీఐ విచారణకు వైకాపా డిమాండ్
Published on: Mon Sep 29, 2014 2:33PM
.jpg)
రాష్ట్రంలో నానాటికి పెరిగిపోతున్న ఇసుక మాఫియాపై సీబీఐ విచారణకు ఆదేశించాలని వై.యస్సార్. కాంగ్రెస్ పార్టీ నేత జ్యోతుల నెహ్రు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసారు. ఈ విషయంలో ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడాన్ని ఆయన తప్పుపట్టారు. ప్రభుత్వ ఉదాసీనత వల్ల అటు ప్రభుత్వానికి, ఇటు ప్రజలకు కూడా తీవ్ర నష్టం జరుగుతోందని, కనుక ప్రభుత్వం తక్షణమే ఇసుక మాఫియాపై సీబీఐ విచారణకు ఆదేశించాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేసారు.
రాష్ట్రంలో ప్రస్తుతం కేవలం ఇసుక మాఫియానే కాక, ల్యాండ్ మాఫియా, లిక్కర్ మాఫియా, ఎర్రచందనం దొంగల మాఫియా, గనుల మాఫియా వంటి రకరకాల మాఫియా గ్యాంగులు చెలరేగిపోతున్నాయి. అయితే జ్యోతుల నెహ్రూ కోరినట్లుగా వాటిపై సీబీఐ విచారణకు ఆదేశించినంత మాత్రాన్న ఆ మాఫియాలు వెనక్కు తగ్గుతాయని ఆశించలేము. వాటన్నిటి వెనుక రాజకీయ పార్టీ నేతలలున్నంత కాలం వారి ఆటలు కొనసాగుతూనే ఉంటాయి. గత రెండు దశాబ్దాలుగా శేషాచలం అడవులలో నుండి ఎర్రచందనం స్మగ్లింగ్ జరుగుతున్నప్పటికీ, ఇంతవరకు ఏ ఒక్క రాజకీయ నాయకుడి పేరు బయటపడకపోవడం గమనిస్తే పరిస్థితి అర్ధమవుతుంది. ఇటువంటి ప్రతీ అక్రమం వెనుకా ఏదో ఒక పార్టీకి చెందిన రాజకీయ నాయకులే ఉంటునప్పుడు వాటిపై సీబీఐ విచారణలు చేయాలని డిమాండ్ చేయడం ద్వారా దాని వెనుక ఉన్న సదరు నేతను ఇబ్బంది పెట్టడానికే తప్ప వేరే ఇతరత్రా ఏ ఉపయోగం ఉండబోదని చెప్పవచ్చును. దేశంలో ఉగ్రవాదులను, మావోయిస్టులను ప్రభుత్వం ఏవిధంగా ఉక్కు పాదంతో అణచివేస్తుందో ఈ మాఫియాలను కూడా అదే విధంగా అణచి వేయగలిగినప్పుడే ఈ మాఫియా ఆగడాలు తగ్గుముఖం పడతాయి.


