TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

జస్టిస్ యశ్వంత్ వర్మ రాజీనామా.. అభిశంసనకు ముందు సంచలన నిర్ణయం

Published on: Fri Apr 10, 2026 2:29PM

అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మ తన పదవికి శుక్రవారం (ఏప్రిల్ 10) రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు పంపారు. గత కొంతకాలంగా తనపై సాగుతున్న అభిశంసన ప్రక్రియ, అలాగే నివాసంలో లభించిన లెక్కకు రాని నగదు వివాదం నేపథ్యంలో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారని భావిస్తున్నారు.    రాజీనామా చేయాలని ఆయనకు గతంలోనూ సూచనలు అందినప్పటికీ అప్పట్లో ఆయన అందుకు నిరాకరించారు.  ఇప్పుడు ఆయన తప్పుకోవడం న్యాయ వర్గాల్లో  హాట్ టాపిక్ గా మారింది. 

గత ఏడాది మార్చి 14న ఢిల్లీలోని జస్టిస్ యశ్వంత్ వర్మ అధికారిక నివాసంలో అగ్నిప్రమాదం సంభవించింది. మంటలను ఆర్పేందుకు వచ్చిన అగ్నిమాపక సిబ్బందికి అక్కడ భారీ ఎత్తున నగదు   కనిపించింది. కాలిపోయిన నోట్లతో పాటు కొన్ని వందల నోట్ల కట్టలు బయటపడటంతో ఈ అంశం అప్పట్లో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఆ సమయంలో ఆయన ఢిల్లీ హైకోర్టులో న్యాయ మూర్తిగా విధులు నిర్వర్తిస్తున్నారు. ఈ ఘటనపై సుప్రీంకోర్టు అంతర్గత విచారణకు ఆదేశించడంతో పాటు, ఆయనను అలహాబాద్ హైకోర్టుకు బదిలీ చేసింది.

అంతర్గత విచారణ కమిటీ నివేదిక ఆధారంగా జస్టిస్ యశ్వంత్ వర్మపై తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తాయి. ఆ నగదుతో తనకు సంబంధం లేదని ఆయన వాదించినప్పటికీ విచారణలో ఆ నగదు ఆయన నివాసంలోనిదే అని తేలింది.  ఈ క్రమంలోనే ఆయనపై పార్లమెంటులో అభిశంసన ప్రక్రియను ప్రారం భించేందుకు   146 మంది లోక్‌సభ సభ్యులు సంతకాలు చేసి నోటీసు ఇచ్చారు. ఈ అభిశంసన ప్రక్రియ వేగవంతం కావడంతోనే ఇప్పుడు ఆయన  రాజీనామా నిర్ణయం తీసుకున్నారని భావిస్తున్నారు. 

ఇలా ఉండగా, యశ్వంత్ వర్మ రాష్ట్రపతికి పంపిన లేఖలో   తన రాజీనామాకు గల కారణాలను వివరించకుండా..  ప్రస్తుత పరిస్థితుల్లో తనకు పదవిలో కొనసాగడం ఇష్టం లేదని పేర్కొన్నారు. న్యాయ వ్యవస్థ గౌరవాన్ని కాపాడేందుకే ఆయన ఈ  నిర్ణయం తీసుకున్నట్లు ఆయన సన్నిహిత వర్గాలు చెప్తున్నాయి. భారతదేశ చరిత్రలో ఒక హైకోర్టు న్యాయమూర్తి ఇలాంటి తీవ్ర ఆర్థిక ఆరోపణలతో అభిశంసన ఎదుర్కొంటూ రాజీనామా చేయడం అత్యంత అరుదు. 

జస్టిస్ యశ్వంత్ వర్మ రాజీనామాతో ప్రస్తుతం సాగుతున్న అభిశంసన ప్రక్రియ నిలిచిపోతుందా లేదా అన్నవిషయంపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. సాధారణంగా రాజీనామా చేసిన తర్వాత అభిశంసన ప్రక్రియను కొనసాగించాల్సిన అవసరం ఉండదు, ఎందుకంటే ఆ ప్రక్రియ ముఖ్య ఉద్దేశ్యం సదరు వ్యక్తిని పదవి నుంచి తొలగించడమే. అయితే ఇక్కడ యశ్వంత్ వర్మపై  నమోదైన అవినీతి ఆరోపణలపై దర్యాప్తు సంస్థలు తదుపరి చర్యలు తీసుకునే అవకాశం ఉందని అంటున్నారు.