క్రియాశీల రాజకీయాల్లో చేరాలని ఎంతో అనుకున్నా.. జస్టిస్ ఎన్వీ రమణ
Published on: Sun Jul 24, 2022 6:56AM
క్రిశీలరాజకీయాల్లో చేరాలని ఒక దశలో ఎంతో అనుకున్నాననీ, అందుకోసం ఎంతో కష్టపడ్డాననీ సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ అన్నారు. అయితే విధి మరోలా నడిపిందని చెప్పారు. జార్ఖండ్ రాంచీలో నేషనల్ యూనివర్శిటీ ఆఫ్ స్టడీ & రీసెర్చ్ ఇన్ లా నిర్వహించిన జస్టిస్ ఎస్బి సిన్హా స్మారక ఉపన్యాసంలో లైఫ్ ఆఫ్ ఏ జడ్జి అన్న అంశంపై ఆయన మాట్లాడారు.
సరిగ్గా నెల రోజులలో పదవీ వరమణ చేయనున్న జస్టిస్ ఎన్వీ రమణ చేసిన వ్యాఖ్యలు ప్రాథాన్యత సంతరించుకున్నాయి. ఈ సందర్భంగా ఆయన మీడియా పోకడలపై కూడా కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రింట్ మీడియా, డిజిటల్ మీడియాల మధ్య స్పష్టమైన తేడాను ఆయన గుర్తించారు. ప్రింట్ మీడియా ఇప్పటికీ ఎంతో కొంత బాధ్యతగా వ్యవహరిస్తోందనీ, అయితే డిజిటల్ మీడియా మాత్రం తెలిసీ తెలియని తనంతో బాధ్యతల గురించి పట్టింపు లేకుండా వ్యవహరిస్తోందన్నారు.
గతంలో పలు సందర్భాలలో ఇన్వేస్టిగేటివ్ జర్నలిజం ఆవశ్యకతను గట్టిగా సమర్ధించిన ఆయన తాజాగా సోషల్ మీడియా తీరుపై నిశిత విమర్శలు చేశారు. న్యాయమూర్తులకు వ్యతిరేకంగా సామాజిక మాధ్యమంలో జరగుతున్న ప్రచారం న్యాయ వ్యవస్థ స్వతంత్రత, పని తీరుపై ప్రభావం చూపే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. సామాజిక మాధ్యమానికి వాస్తవమేదో, అవాస్తవమేదో, మంచి, చెడుల గురించి చెప్పే సామర్థ్యం కానీ, నైపుణ్యం కానీ ఇసుమంతైనా లేదని అభిప్రాయపడ్డారు.
ఈ మీడియా స్వయంగా విచారణ చేసేసి తీర్ులు కూడా ఇచ్చేస్తోందని, మిడిమిడి జ్ణానంతో చర్చలు నిర్వహించి వెల్లడి చేస్తున్న అభిప్రాయాల ప్రభావం ప్రజలపై కూడా పడుతుందని అన్నారు. ఇటువంటి వాటి వల్ల ప్రజాస్వామ్యానికి నష్టం వాటిల్లుతుందని జస్టిస్ ఎన్వీ రమణ అన్నారు.


