టీడీపీకి ఊహించని షాక్.. బీజేపీలోకి సీనియర్ నేత!

 

ఏపీలో టీడీపీ నుంచి బీజేపీలోకి చేరికలకు కాస్త విరామం వస్తుంది అనుకునేలోపు.. కొత్త పేర్లు తెర మీదకు వస్తున్నాయి. తాజాగా మరో నేత పేరు తెర మీదకు వచ్చింది. టీడీపీలో సీనియర్ దళిత నేత జూపూడి ప్రభాకర్ రావు బీజేపీలో చేరడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఏపీలో ఇతర పార్టీల నేతలను చేర్చుకొని బలపడాలని చూస్తున్న బీజేపీకి దళిత నేతల కొరత ఉంది. ఈ నేపథ్యంలో జూపూడి బీజేపీలో చేరి ఆ కోటాలో ఏదైనా నామినేటెడ్ పోస్టు కొట్టేయడానికి చూస్తున్నారట.

వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో కాంగ్రెస్ లో మంచి వాగ్ధాటి గల నేతగా పేరుతెచ్చుకున్న జూపూడి.. ఆ తరువాత, ఏపీలో కాంగ్రెస్ కనుమరుగవడంతో, 2014లో వైసీపీలో చేరారు. కొండపి నుంచి ఎన్నికల్లో పోటీకి దిగి ఓడిపోయారు. టీడీపీ అధికారంలోకి రావడంతో వైసీపీని వీడి టీడీపీ గూటికి చేరారు. అయితే ఇటీవల ఎన్నికల్లో టీడీపీ ఘోరంగా ఓడిపోవడంతో జూపూడి ఆలోచనలో పడ్డారట. భవిష్యత్ ప్రయోజనాల దృష్ట్యా జూపూడి బీజేపీలో చేరడానికి సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది.