TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

జూనియర్ లాయర్‌ను పోలీస్ కస్టడీకి పంపిన జడ్జి.. సుప్రీంకోర్టుకు చేరిన వివాదం!

Published on: Fri May 8, 2026 1:51PM

ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఊహించని పరిణామం చోటుచేసుకుంది. న్యాయమూర్తి ఎదుట అనుచితంగా ప్రవర్తించారన్న కారణంతో ఒక జూనియర్ న్యాయవాదిని నేరుగా పోలీస్ కస్టడీకి పంపడం ఇప్పుడు న్యాయ వర్గాల్లో తీవ్ర సంచలనంగా మారింది. కోర్టు హాల్‌లోనే జరిగిన ఈ హైడ్రామా ఇప్పుడు దేశ సర్వోన్నత న్యాయస్థానం మెట్లు ఎక్కింది.

వివరాల్లోకి వెళ్తే.. హైకోర్టులో ఒక పిటిషన్ విచారణ సందర్భంగా  జూనియర్ న్యాయవాది వాదనలు వినిపిస్తున్నారు. ఆ సమయంలో జడ్జి నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ  ఆయన కొంత అసహనానికి గురయ్యారు.  ఆ క్రమంలో న్యాయవాది  తన  గౌరవానికి భంగం కలిగించేలా ప్రవర్తించారంటూ జడ్జి ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే  కోర్టు ధిక్కరణ కిందకు వస్తుందని హెచ్చరిస్తూ.. అక్కడే ఉన్న పోలీసులను పిలిచి ఆ జూనియర్ అడ్వకేట్ ను 24 గంటల పాటు కస్టడీలోకి తీసుకోవాలని ఆదేశించారు. ఆ సందర్భంగా న్యాయవాది  జడ్జిని క్షమించమని కోరారు. అనారోగ్యంతో బాధపడుతుండటంతో ఒకింత అనుచితంగా ప్రవర్తించానని వివరణ కూడా ఇచ్చుకున్నారు. అయినా జడ్జి తన నిర్ణయాన్ని మార్చుకోలేదు.  కనీసం 10 ఏళ్ల అనుభవం  లేని జూనియర్ ఇలా ప్రవర్తించడమేంటంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఈ ఘటన పెను సంచలనం రేకెత్తించింది.  ఒక న్యాయవాదిని నేరుగా కస్టడీకి పంపడంపై బార్ కౌన్సిల్ ప్రతినిధులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. న్యాయమూర్తుల పట్ల గౌరవం ఉండాల్సిందేనని..  అయితే తక్షణమే కస్టడీకి ఆదేశించడం కఠినమైన చర్య అని పలువురు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం ఈ వ్యవహారం సుప్రీంకోర్టు దృష్టికి వెళ్లింది. బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చైర్మన్ కూడా దీనిపై స్పందించే అవకాశం ఉంది. జూనియర్ లాయర్లపై ఇలాంటి చర్యలు తీసుకోవడం వారి కెరీర్‌ను దెబ్బతీస్తుందని న్యాయవాదుల సంఘాలు అంటున్నాయి.

కోర్టు హాల్ మర్యాదలు,  న్యాయమూర్తులు, న్యాయవాదుల మధ్య సంబంధాలపై ఈ ఘటన పెద్ద ప్రభావం చూపే అవకాశం ఉంది. ఈ ఉదంతంపై సుప్రీంకోర్టు ఎలాంటి ఆదేశాలు ఇస్తుంది? ఏపీ హైకోర్టులో జరిగిన ఈ సంఘటనకు ముగింపు ఎక్కడ? అనేది ఇప్పుడు సర్వత్రా ఆసక్తికరంగా మారింది. న్యాయవ్యవస్థలో క్రమశిక్షణ అవసరమని భావించే వారు జడ్జి నిర్ణయాన్ని సమర్థిస్తుండగా..  మానవతా దృక్పథం ఉండాలని మరికొందరు కోరుతున్నారు.