నారా ఫ్యామిలీకి జూనియర్ ఎన్టీఆర్ దూరమేనా?
Published on: Mon Nov 18, 2024 9:45AM

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి సోదరుడు నారా రామ్మూర్తి నాయుడి అంత్యక్రియలు ఆదివారం ఆయన స్వగ్రామమైన నారా వారి పల్లెలో ప్రభుత్వ లాంఛనాలతో ముగిశాయి. నారా రామ్మూర్తినాయుడి మృతి పట్ల తెలుగుదేశం నేతలు సంతాపం తెలిపారు. అలాగే నారా, నందమూరి కుటుంబ సభ్యులు కూడా ప్రగాఢ సానుభూతి తెలిపారు. దాదాపు అందరూ హైదరాబాద్ లో ఆయన పార్థివదేహానికి నివాళులర్పించారు. పలువురు నారావారి పల్లెకు చేరుకుని అంత్యక్రియలకు హాజరయ్యారు.
అయితే జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్ రామ్ లు మాత్రం నారా రామ్మూర్తి నాయుడి మృతి పట్ల కనీసం సంతాపం కూడా తెలపలేదు. దీంతో ఈ విషయం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. గత కొన్నేళ్లుగా జూనియర్ ఎన్టీఆర్ నందమూరి కుటుంబంతో దూరంగా ఉంటున్నారన్న వార్తలు వినవస్తున్నాయి. నందమూరి బాలకృష్ణ కూడా జూనియర్ ఎన్టీఆర్ తీరు పట్ల ఒకింత ఆగ్రహంతో ఉన్నారని చెబుతున్నారు.
నారా రామ్మూర్తినాయుడి మృతిపట్ల జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్ రామ్ సంతాపం వ్యక్తం చేయకపోవడం, అంత్యక్రియలకు హాజరు కాకపోవడంతో ఆ వార్తలకు బలం చేకూర్చినట్లైందిని పరిశీలకులు సైతం విశ్లేషిస్తున్నారు.


