TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

మా స్థలాలు మాకు అప్పగించండి

Published on: Tue Jul 11, 2023 3:57PM

జవహర్ లాల్ నెహ్రూ మ్యాక్ హౌజింగ్ సొసైటీకి  ఇళ్ళ స్థలాలను ఎందుకు  అప్పగించడం లేదని  ఆంధ్రజ్యోతి ఎడిటర్‌ కె.శ్రీనివాస్‌ సూటిగా ప్రశ్నించారు. సుప్రీంకోర్టు తీర్పు వచ్చి పదినెలలు పూర్తయినా ఈ స్థలాలు స్వాధీనం చేయడంలో ఎందుకు జాప్యం జరుగుతుందో స్పష్టం చేయాలని డిమాండ్‌ చేశారు. స్థలాల స్వాధీనం కోసం అన్ని రాజకీయ పక్షాలను సమన్వయం చేసుకుని, ఉద్యమ కార్యాచరణతో ముందుకు వెళ్ళాలని జెఎన్‌జె సభ్యులకు సూచించారు.
  సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో జేఎన్‌జే సొసైటీ ఫౌండర్‌ మెంబర్‌ పివి రమణరావు అధ్యక్షతన జవహర్‌లాల్‌ నెహ్రూ జర్నలిస్ట్స్‌ మ్యాక్‌ హౌసింగ్‌ సొసైటీ(జేఎన్‌జే మ్యాక్‌ హెచ్‌ఎస్‌) మీడియా సంపాదకులతో రౌండ్‌ టేబుల్‌ సమావేశం నిర్వహించింది.  ఈ సమావేశంలో ఆంధ్ర జ్యోతి ఎడిటర్ శ్రీనివాస్ మాట్లాడుతూ.. సుప్రీంకోర్టు తుది తీర్పు తరువాత కూడా సుధీర్ఘకాలం  ఆ తీర్పు అమలు కాకపోవటం ఆశ్చర్యం కలిగిస్తోందన్నారు. జేఎన్‌జే సొసైటీ మేనేజింగ్‌ కమిటీ ప్రభుత్వానికి చేరువగా వున్నా ఏమాత్రం సభ్యులకు ఉపయోగ పడకపోవడం విచారకరమన్నారు.  ఎన్నికలు దగ్గర పడుతోన్న సందర్భంలో సుప్రీం తుదితీర్పు వచ్చి ఏడాది కావస్తున్న సందర్భంలో తక్షణమే కోర్టు ధిక్కరణకు వెళ్లాల్సిందేనని ఆయన సూచించారు. జేఎన్‌జే స్థలాలు వారికే స్వాధీనం చెయ్యాలని గతంలోనే ప్రెస్‌ అకాడమీ ఛైర్మన్‌కు సూచించానని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. ప్రభుత్వం ఈ స్థలాలు విషయంలో ఎందుకు ఆలస్యం చేస్తుందో ఆర్థకావడంలేదన్నారు.  జేఎన్‌జే కి చెందిన 1100మంది సభ్యులతో మిగతా 5 వేలమంది స్థలాలతో ముడిపెట్టడం భావ్యం కాదని అన్నారు. ప్రభుత్వం చెడు ఆలోచనను ప్రశ్నించాల్సిందేనని స్పష్టం చేశారు. మీరు చేసే ఉద్యమానికి ప్రతిపక్షాల, ప్రజాసంఘాల సహకారం తీసుకుని ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని సలహా ఇచ్చారు. సుప్రీంతీర్పు అమలు ఎందుకు చేయడం లేదనే విషయాన్ని కూడా ప్రభుత్వం ప్రకటించాల్సి వుంది. అయితే, ప్రభుత్వం సొసైటీ సభ్యులు ఇచ్చిన వినతి ప్రతాలకు సమాధానం చెప్పాల్సి వుండగా, నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్ల సమస్య జఠిలంగా మారిందన్నారు.  
ఇదే సరైన సమయం: దిలీప్‌ రెడ్డి
ఎన్నికల సమయంలోనే ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి స్థలాలు సాధించుకోవాలని ఆర్టీఏ మాజీ కమిషనర్‌ దిలీప్‌ రెడ్డి అన్నారు. ప్రభుత్వాలు ఎన్నికల సమయంలోనే పెండింగ్‌ సమస్యలన్నీ పరిష్కరించేందుకు చర్యలు చేపడతాయని, ఇందులో భాగంగానే ఈ జర్నలిస్టుల ఇళ్ళ స్థలాల సమస్య కూడా పరిష్కారమవుతోందని చెప్పారు. ఇప్పటి వరకు ఉమ్మడి ఆంద్రప్రదేశ్‌లో మూడు దఫాలుగా ఇళ్ళస్థలాలు ఇచ్చిన చరిత్ర వుందని,  ప్రస్తుతం జెఎన్‌జె సొసైటీకి సంబంధించి స్థలాల అప్పగింత అంశం సుదీర్ఘంగా కొనసాగుతూనే వుండడం పట్ల  ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తలచుకుంటే కోర్టు కేసులను కాదని ఇచ్చే అవకాశంకూడా వుందని, కానీ ఇక్కడ ఆ పరిస్థితి లేదని దిలీప్‌రెడ్డి స్పష్టం చేశారు. 
జీవన్మరణ సమస్య: మిట్టపల్లి శ్రీనివాస్‌
మన తెలంగాణ సంపాదకులు మిట్టపల్లి శ్రీనివాస్‌ మాట్లాడుతూ జర్నలిస్టుల స్థలాల సమస్య జీవన్మరణ సమస్యగా గుర్తించి ప్రభుత్వం స్పంధించాలని కోరారు. తప్పనిసరి పరిస్థితుల్లో జర్నలిస్టులు ప్రభుత్వం పై ఒత్తిడి పెంచేవిధంగా కార్యక్రమాలు చేపడుతున్నారనీ, దీనిని తప్పుగా భావించకుండా స్థలాలను స్వాధీనం చేయాలన్నారు. పేట్‌ బషీరాబాద్‌లోని 38 ఎకరాల స్థలాన్ని వెంటనే సొసైటీకి స్వాధీనపర్చాలన్నారు. ఈ స్థలాల స్వాధీనం కోసం అవసరమైతే నిరాహార దీక్షలు నిర్విరామంగా కొనసాగించాలని సూచించారు. ప్రజాస్వామ్య పద్దతిలో, గాంధేయ విధానంలో ప్రభుత్వం పై ఒత్తిడి పెంచాలని సూచించారు.
జర్నలిస్టులకు స్థలాల విషయంలో ఏకాభ్రిపాయం వున్నదని సీనియర్‌ జర్నలిస్టు పాశం యాదగిరి స్పష్టం చేశారు. స్థలాల కోసం జర్నస్టులంతా సామ, ధాన భేద దండోపాయాలను అనుసరించాల్సిందేనని ఆయన సూచించారు. ఎన్నికల ప్రకటన వెలువడేలోగా ఇళ్లస్థలాల సాధన ఉద్యమం తీవ్రతరం చేయాలన్నారు. సోషల్‌ మీడియాను ఉపయోగించుకుని మరింత చైతన్యంగా పోరాటం చేయాలని, అందరి సంఘీభావమే పునాధిగా ఏర్పరచుకుని, ముందుకు సాగాలని యాదగిరి అన్నారు. కలాలను పాశుపతాస్త్రాలుగా సంధించి స్థలాలు సాధించాలని పిలుపునిచ్చారు. 
జేఎన్‌జే సొసైటీ మేనేజింగ్‌ కమిటీ సరిగ్గా పనిచేయకపోవడం వలనే ఈ దారుణమైన పరిస్థితి ఏర్పడిందని టివి9 అసైన్‌మెంట్‌ ఎడిటర్‌ జగన్మోహనరెడ్డి అన్నారు. సభ్యులే టీమ్‌ జేఎన్‌జేగా ఏర్పడి పోరాటం చేయడంపట్ల ఆయన అభినందనలు తెలిపారు. 
జర్నలిస్ట్‌ ఫెడరేషన్‌ ప్రధానకార్యదర్శి అంబటి అంజనేయులు మాట్లాడుతూ హైదరాబాద్‌ జర్నలిస్టులు ఏం పాపం చేశారని, వారికి ఇళ్ళ స్థలాలు ఇచ్చే విషయంలో ప్రభుత్వం ఎందుకు ఆలస్యం చేస్తుందో అర్ధం కావడంలేదన్నారు. జేఎన్‌జే సభ్యుల పోరాటం వల్ల ఇళ్ళస్థలాలు సాధించడం సానుకూల పరిస్థితులు ఏర్పడగలవన్నారు. 
సీనియర్‌ జర్నలిస్టు మ్యాడం మధు మాట్లాడుతూ జేఎన్‌జే సభ్యుల లక్ష్యం ఒక్కటేనని, ఇందులో ఎటువంటి విభేదాలు లేవన్నారు. ఎంతో మంది సభ్యులు చనిపోయారని, వారి ఆత్మలు స్థలాలకోసం ఘోషిస్తున్నాయన్నారు. నాడు 2 లక్షల రూపాయల విలువైన స్థలాలు అవి నేడు 2 కోట్ల రూపాయలని అన్నారు. ముఖ్యమంత్రి కేసిఆర్‌కు క్షీరాభిషేకం చేసిన సభ్యుల కళ్ళల్లో నేడు రక్తం కన్పిస్తోందన్నారు.
70 ఎకరాల స్థలం మనదేనని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన తీర్పు తర్వాత కూడా ఎందుకు జాప్యంజరుగుతోందని మెట్రో దినప్రతిక సంపాదకులు దేవరకొండ కాళీదాస్‌ ఆవేదన వ్యక్తం చేసారు.
అధ్యక్షత వహించిన జెఎన్‌జే ఫౌండర్‌ మెంబర్‌ పి వి రమణరావు మాట్లాడుతూ ప్రతిసభ్యునికి స్థలాలు వచ్చేలాగా మా పోరాటం వుంటుందని స్పష్టం చేసారు. రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్న సంపాదకులతో కూడిన. వినతి పత్రాన్ని ముఖ్య మంత్రి కే సి ఆర్ కు అందజేస్తామని ఆయన తెలిపారు. యూ.ఎన్‌.ఐ. బ్యూరో చీఫ్‌ నాగేశ్వరరావు, బిసి టైమ్స్‌ సంపాదకులు సూర్యారావు, సీనియర్‌ జర్నలిస్టులు ఆకుల ఆమరయ్య, మాలకొండయ్య, సుందర్‌శర్మ, కెవిఎస్‌ సుబ్రమణ్యం తదితరులు మాట్లాడారు. 
రౌండ్‌టేబుల్‌ సమావేశంలో పాల్గొన్న సంపాదకుల సంతకాలతో కూడిన వినతి పత్రం ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావుకు అందజేస్తామన్నారు. ఈ సమావేశంలో సుప్రీంకోర్టు తీర్పు మేరకు పేట్‌ బషీరాబాద్‌లోని 38 ఎకరాల స్థలాన్ని తక్షణమే జెఎన్‌జె సొసైటీకి అప్పగించాలని కోరుతూ ఏకగ్రీవ తీర్మానం చేసింది. అలాగే పేట్‌ బషీరాబాద్‌ స్థలం స్వాధీనం కోసం ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు ఆందోళన కార్యక్రమాల షెడ్యూల్‌ను సిద్దం చేసింది.
ఈ కార్యక్రమంలో వివిధ మీడియా సంస్థలకు చెందిన సంపాదకులు మరియు జెఎన్‌జె సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.